Anthropic: ఆంథ్రోపిక్కు షాక్.. ఫ్యాబిల్ 5, మిథోస్ 5 సేవలపై అమెరికా ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
శక్తివంతమైన కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్ల అభివృద్ధితో ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిన ఆంథ్రోపిక్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన 'ఫ్యాబిల్ 5', 'మిథోస్ 5' ఏఐ మోడళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రతా కారణాలను చూపుతూ అమెరికా ప్రభుత్వం ఈ మోడళ్లపై ఆంక్షలు విధించడంతో ఆంథ్రోపిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రత్యేకంగా 'ఫ్యాబిల్ 5' మోడల్ను విడుదల చేసిన కేవలం మూడు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
వివరాలు
విదేశీ పౌరులకు నిషేధం
ఫ్యాబిల్ 5, మిథోస్ 5 ఏఐ మోడళ్లపై భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేసిన అమెరికా ప్రభుత్వం, వాటి వినియోగాన్ని విదేశీ పౌరులకు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆంథ్రోపిక్లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు కూడా ఈ మోడళ్ల యాక్సెస్ ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ కంపెనీకి లేఖ పంపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఆంథ్రోపిక్.. విదేశీ పౌరులకు మాత్రమే కాకుండా, అన్ని వర్గాల వినియోగదారులకు ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
వివరాలు
హ్యాకింగ్ ముప్పుపై ఆందోళనలు
ఈ ఏఐ మోడళ్లపై నిషేధానికి గల పూర్తి కారణాలను అమెరికా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈ మోడళ్లలోని అధునాతన సాంకేతికతను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా కోడ్లలోని సాఫ్ట్వేర్ లోపాలను సులభంగా గుర్తించే సామర్థ్యం ఈ టూల్స్కు ఉండటంతో, హ్యాకర్లు వాటిని దాడులకు వినియోగించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఆంథ్రోపిక్ వివరణ
అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై ఆంథ్రోపిక్ స్పందిస్తూ, ఈ మోడళ్ల దుర్వినియోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. 'ఇప్పటికే అందుబాటులో ఉన్న అనేక ఏఐ మోడళ్లు కూడా హ్యాకర్లకు అదనపు సామర్థ్యాలను అందిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క కారణంతో కోట్లాది మంది వినియోగదారుల కోసం రూపొందించిన కమర్షియల్ మోడల్ను వెనక్కి తీసుకోవడం బాధాకరం. మా భద్రతా పరీక్షల్లో ఎలాంటి లోపాలు గుర్తించలేదు'' అని సంస్థ వెల్లడించింది.
వివరాలు
'ప్రాజెక్ట్ గ్లాస్వింగ్'లో భాగంగా అభివృద్ధి
గత మంగళవారం ఆంథ్రోపిక్ 'ఫ్యాబిల్ 5' మోడల్ను విడుదల చేసింది. ఇది 'మిథోస్ 5'కు అధునాతన వెర్షన్గా రూపొందించారు. 'ప్రాజెక్ట్ గ్లాస్వింగ్'లో భాగంగా అభివృద్ధి చేసిన 'క్లాడ్ మిథోస్' ఒక అత్యాధునిక ఏఐ వ్యవస్థ. వివిధ సంస్థల సాఫ్ట్వేర్లలోని భద్రతా లోపాలను గుర్తించి, సైబర్ రక్షణను మరింత బలోపేతం చేయడానికి దీన్ని రూపొందించారు. ఈ టూల్ యాక్సెస్ను ఎంపిక చేసిన కొద్ది సంస్థలకే ఆంథ్రోపిక్ అందించింది. ఆ జాబితాలో భారత్కు చెందిన కొన్ని కంపెనీలు కూడా ఉన్నట్లు సమాచారం.