Ashwin Yardi: వారానికి 47.5-గంటల పని..వారాంతంలో నో ఇ-మెయిల్స్:క్యాప్జెమినీ CEO
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల పనిగంటల విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది.ఈ సందర్భంలో క్యాప్జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది (Ashwin Yardi) తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆయన ప్రకారం,రోజుకు 9.30 గంటలు,వారానికి ఐదు రోజుల పాటు పని చేస్తే సరిపోతుందని తెలిపారు.
నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరంలో పాల్గొన్న అశ్విన్ యార్డికి,"ఒక ఉద్యోగి వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి?"అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి స్పందిస్తూ,"రోజుకు 9.30 గంటలు,వారానికి ఐదు రోజులు పని చేస్తే సరిపోతుంది.వీకెండ్లో ఈ-మెయిల్స్ పంపకూడదు.
గత నాలుగేళ్లుగా నేను పాటిస్తున్న సూత్రం ఇదే" అని అన్నారు.
అయితే, కొన్ని సందర్భాల్లో వారాంతాల్లో పని చేయాల్సి వస్తుందని ఒప్పుకున్నారు, కానీ అప్పుడు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపనని స్పష్టం చేశారు.
వివరాలు
ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే.. వారానికి 70 గంటలు
ఇదే కార్యక్రమంలో నాస్కామ్ ఛైర్పర్సన్ సింధు గంగాధరన్ కూడా పాల్గొన్నారు. ఆమె కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, పనిగంటల కంటే ఉత్పాదకత ముఖ్యమని తెలిపారు.
ఇక ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గతంలో భారత యువత ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఆయన అభిప్రాయాన్ని కొందరు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు.
అలాగే, ఎల్ అండ్ టీ (L&T) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ (S.N. Subrahmanyan) కూడా ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చకు కేంద్రబిందువుగా మారాయి.