
CoinDCX: క్రిప్టో ప్లాట్ఫామ్ CoinDCX పై సైబర్ దాడి .. రూ.378 కోట్ల నష్టం..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మరోసారి భారీ సెక్యూరిటీ లోపం చోటు చేసుకుంది. భారతదేశంలోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన CoinDCX హ్యాకింగ్కు గురైంది. ఈ సైబర్ దాడిలో ఏకంగా 44 మిలియన్ డాలర్లు,అంటే దాదాపు రూ.378 కోట్ల మేర నష్టం వాటిల్లింది. శనివారం తెల్లవారుజామున ఈ హ్యాకింగ్ జరిగినట్టు సమాచారం. కంపెనీకి సంబంధించిన అంతర్గత ఆపరేషన్ ఖాతాలలో ఒకదానిని లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు ఈ దాడిని నిర్వహించినట్టు తెలిసింది. అయితే ముంబై కేంద్రంగా ఉన్న ఈ క్రిప్టో సంస్థ.. వినియోగదారుల వ్యక్తిగత నిధులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని హామీ ఇచ్చింది.
వివరాలు
వినియోగదారుల వ్యక్తిగత ఆస్తులకు ఎలాంటి ముప్పు లేదు
CoinDCX ఒక అధికారిక ప్రకటనలో.. కేవలం లిక్విడిటీ ఆపరేషన్ కోసం ఉపయోగించే ఖాతా మాత్రమే హ్యాకర్ల దాడికి గురైనట్టు తెలిపింది. వినియోగదారుల వ్యక్తిగత ఆస్తులకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. సంస్థ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా మాట్లాడుతూ.. ఇది ఒక ''అత్యాధునిక సర్వర్ ఉల్లంఘన'' దాడి అని, దీని వల్ల తమ సంస్థకు నష్టం జరిగిందని వివరించారు. అయినప్పటికీ, కంపెనీ ట్రెజరీ నిల్వల ద్వారానే పూర్తిగా ఈ నష్టాన్ని పూడ్చుకోవచ్చని, దానితోనే ఇలాంటి ఆర్థిక నష్టాన్ని భరించగలమని స్పష్టం చేశారు. ఈ హ్యాకింగ్ దాడిని గుర్తించిన వెంటనే CoinDCX సంస్థ తమ Web3 ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది. ప్రస్తుతం మాత్రం ఆ ప్లాట్ఫామ్ మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపింది.