LOADING...
Oil prices: అమెరికా-ఇరాన్ చర్చల అనిశ్చితి మధ్య.. మళ్లీ వంద డాలర్లు దాటిన ముడి చమురు ధరలు
అమెరికా-ఇరాన్ చర్చల అనిశ్చితి మధ్య..మళ్లీ వంద డాలర్లు దాటిన ముడి చమురు ధరలు

Oil prices: అమెరికా-ఇరాన్ చర్చల అనిశ్చితి మధ్య.. మళ్లీ వంద డాలర్లు దాటిన ముడి చమురు ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్య పరిణామాలు, అలాగే ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల భయంతో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా పడిపోయిన ధరలు తిరిగి కోలుకుని, ముందు సెషన్‌లో నమోదైన దాదాపు పది శాతం పడిపోవడాన్ని అధిగమించాయి. జూలై నెల సరఫరాకు సంబంధించిన బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు 0.91 శాతం పెరిగి 102.19 డాలర్లకు చేరగా,జూన్ సరఫరాకు సంబంధించిన పశ్చిమ టెక్సాస్ మధ్యస్థ చమురు ధర 1.23శాతం పెరిగి 96.25డాలర్లకు నమోదైంది. చమురు ధరల్లో ఈ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తత. ఒకవైపు వాషింగ్టన్,టెహ్రాన్ మధ్య శాంతి ఒప్పందానికి చేరువవుతున్నారనే వార్తలు వస్తుండగా, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

వివరాలు 

"ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" పేరుతో ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య

ఇరాన్ శాంతి ఒప్పందాన్ని అంగీకరించకపోతే తీవ్ర బాంబుదాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అలాగే "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" పేరుతో ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ చర్చల నిబంధనలను అంగీకరిస్తే ఆ చర్యలు ముగుస్తాయని,అయితే ఇది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందం కుదిరితే ఒమాన్ గల్ఫ్‌లోని ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నౌకా నిర్బంధాన్ని ఎత్తివేస్తామని, హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవనున్నట్లు తెలిపారు. ఇక అమెరికా, ఇరాన్ మధ్య ఒక పేజీ, పద్నాలుగు అంశాల అవగాహన ఒప్పందం రూపుదిద్దుకుంటోందని ఒక నివేదిక వెల్లడించింది. ఈ ముసాయిదాలో కాల్పుల విరమణతో పాటు భవిష్యత్ చర్చలకు పునాది వేసే అంశాలు ఉన్నాయి.

వివరాలు 

ఇరాన్ నుంచి నలభై ఎనిమిది గంటల్లో సమాధానం ఆశిస్తున్నాం: అమెరికా 

ముఖ్య అంశాలపై ఇరాన్ నుంచి నలభై ఎనిమిది గంటల్లో సమాధానం ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. అయితే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా స్పందిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఖాయీ తెలిపారు. మార్కెట్ విశ్లేషకులు మాత్రం పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాల్పుల విరమణ తాత్కాలికమే కావచ్చని, అమెరికా-ఇరాన్ చర్చలు నిలిచిపోతే మళ్లీ ఉద్రిక్తతలు పెరిగి చమురు ధరలు మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. అలాగే హోర్ముజ్ జలసంధి ఎక్కువకాలం మూసివేయబడితే రోజుకు సుమారు రెండు కోట్ల బ్యారెల్ల చమురు సరఫరా ప్రభావితమవుతుందని, అప్పుడు ధరలు బ్యారెల్‌కు 110 నుంచి 150 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement