
Trump: ట్రంప్ షాకింగ్ నిర్ణయం .. సోషల్ మీడియా వివరాలు లేనివారికి వీసా నిరాకరణ!
ఈ వార్తాకథనం ఏంటి
వీసా పొందాలనుకునే వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా ఎదురుదెబ్బ అయ్యింది. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ సోషల్ మీడియా అకౌంట్ల సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఇవ్వనట్లయితే, వారి వీసా దరఖాస్తును రద్దు చేయడానికి అధికారులు ముందడుగు వేస్తున్నారు. అంతేకాక, సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సమాచారం ఆధారంగా, దరఖాస్తుదారులపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడితే, వారికి అమెరికాలోకి ప్రవేశం అసాధ్యమవుతుంది.
వివరాలు
భారతీయులు కూడా కఠినమైన పరిస్థితులు
ఉదాహరణకు, నార్వేకు చెందిన 21 ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ అనే యువకుడు అమెరికాలో పర్యటించాలనుకున్నాడు. కానీ అతని ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను బట్టతలగా చూపించే మీమ్ ఫొటో ఉండటం వల్ల అతని పర్యటన కల తీరకుండానే మిగిలిపోయింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, భారతీయులు కూడా అమెరికా వెళ్లే విషయంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనాల్సి రావచ్చు. దీనికి కారణం, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయమే.
వివరాలు
వీసా మంజూరుపై మరింత కఠినంగా ట్రంప్ ప్రభుత్వం
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా ప్రభుత్వం వీసా మంజూరులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, అభ్యర్థుల నేపథ్యాన్ని వడపోత ప్రక్రియ ద్వారా పరిశీలించడానికి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీసా దరఖాస్తుదారుల గుణగణాలను విశ్లేషించడంలో భాగంగా, సోషల్ మీడియా సమాచారాన్ని కీలకంగా తీసుకుంటున్నారు.
వివరాలు
సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే నో వీసా
అమెరికా వీసా దరఖాస్తుదారులు గత ఐదేళ్లలో ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాల వివరాలను DS-160 ఫారమ్లో నమోదు చేయాలి. ఈ వివరాలు వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లే కన్ఫర్మేషన్ పేజీలో ఉండాలి. అభ్యర్థులు తమ సోషల్ మీడియా సమాచారం అందించాల్సి ఉంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అందించిన ఖాతాల పరిశీలన చేపట్టి, అనుమానాస్పదమైన అంశాలు కనిపిస్తే, వీసా మంజూరు చేసే అవకాశాన్ని తిరస్కరిస్తారు.
వివరాలు
అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలా
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ తీసుకున్న తాజా చర్యలు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను నియంత్రించడానికి తీసుకున్న పావులు కావచ్చు. గతేడాది అమెరికాలోని పలు విద్యాసంస్థల్లో పాలస్తీనా పక్షాన విద్యార్థులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చిన నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినంగా స్పందించింది. అయితే, అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ చర్యలు దేశ భద్రతను మెరుగుపర్చేందుకు తీసుకున్నదిగా చెబుతోంది.
వివరాలు
భారత్లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన
ఈ చర్యల నేపథ్యంగా, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అందులో, 2019 నుంచే వలసదారులు మరియు ఇతర వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను ఫారమ్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. "యునైటెడ్ స్టేట్స్కు భద్రతాపరంగా ముప్పు కలిగించే వ్యక్తులను గుర్తించడానికి, మేము వీసా స్క్రీనింగ్ ప్రక్రియలో అందుబాటులో ఉన్న సమాచారం మొత్తం వినియోగిస్తాం," అని ఆ ప్రకటనలో వివరించింది.