
Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారత మార్కెట్లోకి టెస్లా రానుంది.ఈ మేరకు ఇండియన్ రోడ్లపై ఈవీ కారు పరుగులు పెట్టనుంది. భారతదేశంలో తయారీ ప్లాంట్ కోసం సదరు సంస్థ చర్చలు ప్రారంభించింది.
ఒక్కో కారును రూ. 20 లక్షల ధర నుంచే విక్రయించేందుకు సన్నాహకాలు చేస్తోంది.
భారత ఆటోమోబైల్ మార్కెట్లోకి త్వరలోనే అడుగుపెట్టాలని ఎలక్ట్రికల్ కార్ల దిగ్గజం టెస్లా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన పెట్టుబడులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ అంటోంది.
ఈ సందర్భంగానే కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏటా 5 లక్షల విద్యుత్తు వాహనాలను తయారు చేయాలని సంస్థ భావిస్తోంది.
Details
టెస్లా ప్రారంభ ధర రూ.20 లక్షలు
ఇందుకు అవసరమైన ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు టెస్లా సన్నద్ధం అవుతోంది. ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేసిన కార్లను భారత్ కేంద్రంగా ఇండో-పసిఫిక్ దేశాలకు ఎక్స్ పోర్ట్ చేయాలని ఎలాన్ మస్క్ ప్రణాళికలు రచించినట్లు సమాచారం.
భారత్లో విద్యుత్తు వాహనాల (EV) ప్రారంభ ధర రూ.20 లక్షలుగా ఉండనుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి.
ఇటీవలే ప్రధాన మంత్రి మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మాట్లాడిన ఎలాన్ మస్క్ త్వరలోనే ఇండియాలో టెస్లా ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
details
విలాసవంతమైన కార్లపై 100 శాతం సుంకం
మరోవైపు దేశంలోకి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో సుంకాలు విధిస్తోంది. 'కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రెయిట్' విలువ 40 వేల డాలర్లు దాటిన కార్లపై 100 శాతం సుంకాన్ని వర్తింపజేయనుంది.
అయితే టెస్లా కారు మోడళ్లన్నీ ఖరీదైన, విలాసవంతమైన కేటగిరీలోకే వస్తున్నాయి. ఈ మేరకు పన్నులను తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని మస్క్ కోరుతున్నారు.
మేకిన్ ఇండియాలో భాగంగా స్థానికంగా తయారు చేస్తేనే ఖర్చు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది.
విడి భాగాలను భారత్లోనే అసెంబుల్ చేయడంపై దృష్టి సారించాలని సూచించింది. దీంతో కొంతకాలం స్తబ్ధుగా ఉన్న టెస్లా తాజాగా మరోసారి చర్చలనువేగవంతం చేసింది.