Page Loader
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 80 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 80 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 80 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు సుస్థిరంగా కొనసాగాయి. భవిష్యత్ వాణిజ్య చర్చల సందర్భంగా చైనాకు సంబంధించిన దిగుమతులపై విధించిన సుంకాలను తగ్గించే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌ను ప్రోత్సహించాయి. అంతేకాక, వడ్డీ రేట్ల విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్‌ను పదవి నుండి తొలగించే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ స్పష్టంగా ప్రకటించడమూ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

వివరాలు 

సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్క్ పైన..

దేశీయంగా ఐటీ రంగంలోకి పెట్టుబడిదారుల మొగ్గుచూపు కనిపించింది.దీనివల్ల సంబంధిత షేర్లకు మద్దతు లభించగా,బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం గమనించదగ్గది. ఈ పరిస్థితుల నడుమ సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్క్ పైన ముగియడం విశేషం. సెన్సెక్స్ ఉదయం ప్రారంభం నుంచే 80 వేల మార్కును దాటి ట్రేడ్ అయింది. ఇది 80,142.09 పాయింట్ల వద్ద ప్రారంభమై,గత ముగింపు 79,595.59 పాయింట్లతో పోల్చితే లాభాల్లోనే ఉంది. మధ్యలో కొంతకాలం ఒడిదొడుకులకు లోనైనా, అనంతరం తిరిగి లాభపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇది 80,245.4 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 520.90 పాయింట్ల లాభంతో 80,116.49 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం బలంగా నిలిచి, 161.70 పాయింట్లు పెరిగి 24,328.95 వద్ద స్థిరపడింది.

వివరాలు 

బంగారం ధర స్వల్పంగా తగ్గి ఔన్సుకు 3239 డాలర్లు 

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో రూపాయి విలువ అమెరికా డాలరుతో పోలిస్తే 24 పైసలు తగ్గి 85.43గా నమోదైంది. సెన్సెక్స్‌లో చేరిన 30 ప్రధాన షేర్లలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు మంచి లాభాలను సాధించాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లలో నష్టాలు నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 68.25 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర స్వల్పంగా తగ్గి ఔన్సుకు 3239 డాలర్ల వద్ద ఉంది.