Loading...
Gold Rate today: డాలర్ పతనం.. $4,400 దిశగా పరుగులు తీస్తున్న బంగారం

Gold Rate today: డాలర్ పతనం.. $4,400 దిశగా పరుగులు తీస్తున్న బంగారం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరువవుతున్నాయి. అమెరికా వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనపడటం,రిటైల్‌ విక్రయాలు మందగించడంతో డాలర్‌ ఇండెక్స్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి మరోసారి పెరిగింది. ఆసియా మార్కెట్లలో స్పాట్‌ గోల్డ్‌ ధర 0.4 శాతం పెరిగి ఔన్సుకు 4,391.60 డాలర్లకు చేరింది. దీంతో పసిడి వరుసగా రెండో వారంలోనూ లాభాల బాటలో కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ 0.2శాతం క్షీణించింది. ఫలితంగా ఇతర కరెన్సీలు ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం ధర కొంత అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తక్షణమే వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు బలపడటం కూడా పసిడి ధరలకు కలిసొచ్చింది.

వివరాలు 

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో పెరిగిన డిమాండ్

దేశీయ మార్కెట్‌లో ఉదయం 9.20 గంటల సమయంలో ఎంసీఎక్స్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,020గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.2,37,361గా ఉంది.

చైనాతో పాటు పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పసిడిపై ఇన్వెస్టర్ల ఆసక్తి మళ్లీ పెరుగుతోంది.

ఏప్రిల్‌ తర్వాత తొలిసారిగా బంగారం ధర 100 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ స్థాయిని అధిగమించింది.

మరోవైపు ప్రైవేట్‌ ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను రక్షించుకునేందుకు పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.

వివరాలు 

భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.

హార్ముజ్‌ జలసంధి సమీపంలో నౌకలపై దాడులు జరగడం, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండటంతో ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొంది. హార్ముజ్‌ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్‌, ఒమాన్‌ దేశాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అయితే ఈ చర్చల్లో అమెరికా లేకపోవడం మార్కెట్‌ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

నిపుణుల అంచనా ఏంటి?

పసిడి తన బుల్లిష్‌ ట్రెండ్‌ను కొనసాగించాలంటే ఔన్సుకు 4,400డాలర్ల కీలక నిరోధ స్థాయిని అధిగమించాల్సి ఉంటుందని గ్లోబల్‌ ఎక్స్‌ ఈటీఎఫ్‌ల విశ్లేషకుడు జస్టిన్‌ లిన్‌ తెలిపారు.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ఇప్పటికే మార్కెట్‌లో కొంతవరకు ప్రతిఫలించిందని ఆయన పేర్కొన్నారు.

అందువల్ల స్పష్టమైన కొత్తసంకేతాలు వచ్చే వరకు పసిడి ధరలు కొంతకాలం పరిమిత శ్రేణిలోనే కదిలే అవకాశం ఉందని వివరించారు.

ఫెడ్‌ నిర్ణయాలపై దృష్టి

బుధవారం విడుదల కానున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ జూలై పాలసీ సమావేశ మినిట్స్‌పై మార్కెట్‌ వర్గాలు దృష్టి పెట్టాయి.

ఈ మినిట్స్‌ ద్వారా భవిష్యత్తులో వడ్డీ రేట్లపై ఫెడ్‌ అనుసరించబోయే విధానానికి సంబంధించి మరిన్ని స్పష్టమైన సంకేతాలు లభించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

వెండి, ప్లాటినం కూడా లాభాల్లోనే..

ఆ సంకేతాలు బంగారం ధరల తదుపరి కదలికపై ప్రభావం చూపవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

బంగారం మాత్రమే కాకుండా ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరిగాయి.

వెండి ధర 1.3 శాతం ఎగబాకి ఔన్సుకు 65.54 డాలర్ల వద్ద స్థిరపడింది. ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా స్వల్పంగా పుంజుకున్నాయి.

దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాలపై కొనుగోలు ఆసక్తి కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.

ADVERTISEMENT