
FASTag Annual Pass Records: ఫాస్టాగ్ వార్షిక పాస్కు విపరీతమైన డిమాండ్.. తొలిరోజే 1.4 లక్షల మంది వినియోగదారులు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు అద్భుతమైన స్పందన లభించింది. అధికారుల ప్రకారం ప్రారంభ రోజే సుమారు 1.4లక్షల మంది వినియోగదారులు ఈ పాస్ను కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజాల్లో ఆగస్టు 15న ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేరోజు సాయంత్రం 7గంటల వరకు సుమారు 1.4లక్షల వాహనదారులు పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. 1.39 లక్షలకుపైగా లావాదేవీలు నమోదయినట్లు కూడా వెల్లడైంది. అంతేకాక రాజ్మార్గ్ యాత్ర యాప్లో ఏకకాలంలో 20,000 నుంచి 25,000 మంది వినియోగదార్లు లాగిన్ అయ్యే స్థాయి నమోదైందని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI)తెలిపింది.
Details
ఏడాదిలో ఎన్నిసార్లైనా పునరుద్ధరించవచ్చు
రూ. 3,000తో అందుబాటులో ఉన్న ఫాస్టాగ్ టోల్ పాస్ కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులకు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు (ఏది ముందైతే అది) జాతీయ రహదారులపై ప్రయాణించడానికి అవకాశం ఇస్తుంది. వాణిజ్య వాహనాల కోసం కాదు. 200 ట్రిప్పులు పూర్తైన తర్వాత, రూ. 3,000 చెల్లించి పాస్ను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. ఈ విధంగా వార్షిక పాస్ను ఏడాదిలో ఎన్నిసార్లైనా పునరుద్ధరించవచ్చు. మునుపే ఫాస్టాగ్ ఉన్నవారు కొత్త పాస్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్తోనే వార్షిక టోల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI, MoRTH వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఈ వార్షిక పాస్ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.