RBI: రూపాయి పతనంపై ఆర్బీఐ అలర్ట్.. వడ్డీ రేట్ల పెంపుపై ఆలోచనలు
ఈ వార్తాకథనం ఏంటి
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోతుండటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పలు కీలక చర్యలను పరిశీలిస్తోంది. అవసరమైతే వడ్డీ రేట్లు పెంచే అవకాశాన్ని కూడా ఆర్ బి ఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ వారం రూపాయి విలువ డాలర్కు దాదాపు 97 స్థాయికి పడిపోవడంతో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సహా ఉన్నతాధికారులు వరుస అంతర్గత సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జూన్ 5న తదుపరి ద్రవ్య విధాన సమీక్ష ఉండగా, అవసరమైతే ఆ తేదీకి ముందే ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. 2022 మేలో కూడా ఆర్బీఐ షెడ్యూల్కు ముందే వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే.
వివరాలు
దేశంలోకి విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పెంచాలని భావిస్తున్న ఆర్బీఐ
ఇక విదేశాల్లోని భారతీయుల నుంచి డాలర్లు సమీకరించేందుకు ప్రత్యేక డిపాజిట్ పథకాలు తీసుకురావడం, విదేశీ మార్కెట్లో డాలర్ బాండ్లు విడుదల చేయడం వంటి మార్గాలపై కూడా చర్చ జరుగుతోంది. ఈ చర్యలతో దేశంలోకి విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పెంచాలని ఆర్బీఐ భావిస్తోంది. 2013లో అమెరికా ఫెడ్ విధానాల ప్రభావంతో వచ్చిన 'టేపర్ టాంట్రం' సమయంలో తీసుకున్న చర్యల మాదిరిగానే ఈసారి కూడా ఆర్బీఐ ముందుకెళ్లే అవకాశముంది. అప్పట్లో ప్రవాస భారతీయుల డిపాజిట్ పథకాల ద్వారా భారీగా డాలర్లు దేశంలోకి వచ్చాయి. ఈసారి అలాంటి పథకాల ద్వారా సుమారు 50 బిలియన్ డాలర్ల వరకు సమీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
రూపాయి పతనాన్ని అడ్డుకోవడమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం
దేశ ఆర్థిక పరిస్థితి బలంగానే ఉన్నప్పటికీ రూపాయి విలువలో అది కనిపించడం లేదని విధాన నిర్ణేతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూపాయి పతనాన్ని అడ్డుకోవడమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా-భారత్ వడ్డీ రేట్ల మధ్య తేడా తగ్గిపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. 2026లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా నిధులు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేందుకు, డాలర్ నిల్వలను బలోపేతం చేసేందుకు ఆర్బీఐ ఇప్పటికే 5 బిలియన్ డాలర్ల స్వాప్ వేలాన్ని ప్రకటించింది. అవసరమైతే ఇలాంటి మరిన్ని స్వాప్ వేలాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.