
India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నుండి దిగుమతయ్యే కొన్ని ఉత్పత్తులపై ప్రతీకార చర్యల రూపంలో ప్రత్యేక సుంకాలు విధించబోతున్నట్టు భారత్ ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు తెలియజేసింది.
ఇది ప్రధానంగా భారత ఉక్కు (స్టీల్),అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలకు ప్రతిస్పందనగా తీసుకున్న నిర్ణయం.
ఈ మేరకు WTO ద్వారా అమెరికాకు అధికారిక నోటీసులు పంపింది భారత్.
అయితే, వాటిని అమెరికా తిరస్కరించింది. ఈ సుంకాలు బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని, భారత్ పేర్కొన్నట్లుగా అవి 'భద్రతా చర్యలు' కాదని, తన జాతీయ భద్రత అవసరాలపై ఆధారపడి ఉన్నవని తెలిపింది.
వివరాలు
అమెరికా నుండి వచ్చే లోహాలపై అధిక సుంకాలు
ఈ అంశంపై న్యూఢిల్లీతో ఎలాంటి చర్చలకు తమకు ఆసక్తి లేదని ట్రంప్ పరిపాలనలోని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
దీనితో, అమెరికా నుండి దిగుమతులపై ఇస్తున్న మినహాయింపులు, రాయితీలను భారత ప్రభుత్వం పునఃపరిశీలించాలని యోచిస్తోంది.
అంతేకాక, అమెరికా నుండి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించేందుకు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.
ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్లు విధించారు.
భారత్ నుండి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంపై తొలుత 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా, తాజాగా ఆ సుంకాలను 2025 జూన్ 4 నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.
వివరాలు
భారత్ ఎగుమతులపై భారీ ప్రభావం
ఈనిర్ణయం వల్ల భారత్ ఎగుమతులపై భారీ ప్రభావం పడనుంది. సుమారుగా 7.6బిలియన్ డాలర్ల విలువైన భారత ఉత్పత్తులపై దీనివల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అత్యంత రక్షణాత్మక విధానాన్ని అనుసరిస్తోందని భారత్ తీవ్రంగా విమర్శిస్తూ WTOని ఆశ్రయించింది.
ఇదిలా ఉండగా,భారతదేశం - అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందానికి చర్చలు చివరి దశకు చేరుకున్నట్టు వార్తలొస్తున్న తరుణంలో,ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ఒప్పందం ద్వారా అమెరికా వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ పలు మినహాయింపులు, వాణిజ్య లాభాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్న ప్రచారం సాగింది.
అయితే అమెరికా తాజా విధానాల నేపథ్యంలో ఆ రాయితీలపై కోతలు వచ్చే అవకాశాన్ని భారత్ పరిగణలోకి తీసుకుంటోంది.