India's Exports Surge: జూలైలో భారత్ వస్తు ఎగుమతులకు జోరు.. 19.63 శాతం వృద్ధితో కొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
జూలైలో భారత్ వస్తు ఎగుమతులు జోరందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన 19.63 శాతం వృద్ధి చెంది 4,424 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.22 లక్షల కోట్లు) చేరాయి. 2022 జూన్ తర్వాత నమోదైన అత్యధిక వృద్ధి ఇదే కావడం విశేషం. అయితే ఇదే సమయంలో దిగుమతులు కూడా భారీగా పెరగడంతో వాణిజ్య లోటు ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. జూలైలో దేశ దిగుమతులు 17.52 శాతం పెరిగి 7,622 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7.27లక్షల కోట్లు) చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 3,198 కోట్ల డాలర్లకు (రూ.3.05 లక్షల కోట్లు) పెరిగింది. దిగుమతుల పెరుగుదలకు ప్రధానంగా ముడిచమురు కారణమైంది. జూలైలో క్రూడాయిల్ దిగుమతులు 17.64 శాతం పెరిగి 1,831 కోట్ల డాలర్లకు చేరాయి.
వివరాలు
పశ్చిమాసియా దేశాలకు పెరిగిన ఎగుమతులు
మొత్తం దిగుమతుల్లో ముడిచమురు వాటా దాదాపు 24 శాతంగా ఉంది. ఈ వివరాలను గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ పశ్చిమాసియా దేశాలకు భారత్ ఎగుమతులు జూలైలో మెరుగ్గా నమోదయ్యాయి.
వార్షిక ప్రాతిపదికన 8.62 శాతం పెరిగి 570 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
గత ఏడాది జూలైలో ఈ ప్రాంతానికి భారత్ చేసిన ఎగుమతుల విలువ 520 కోట్ల డాలర్లుగా ఉంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో మార్చిలో తొలిసారిగా పశ్చిమాసియాకు భారత్ ఎగుమతులు తగ్గాయి.
అయితే ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడింది.
వివరాలు
పశ్చిమాసియా దేశాలకు పెరిగిన ఎగుమతులు
ప్రస్తుతం ఈ ప్రాంతంతో భారత్ వాణిజ్యం మళ్లీ పూర్వ స్థాయికి చేరుకుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు.
యూఏఈకి భారత్ ఎగుమతులు 10.15 శాతం పెరిగి 330 కోట్ల డాలర్లకు చేరాయి.
మరోవైపు సౌదీ అరేబియాకు ఎగుమతులు 2.73 శాతం తగ్గి 76.37 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
జూలైలో యూఏఈ, సౌదీ అరేబియా నుంచి భారత్ చేసుకున్న దిగుమతులు తగ్గాయి.
అయితే ఒమన్ నుంచి దిగుమతులు మాత్రం రెండింతలకు పైగా పెరిగి 157 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
వివరాలు
బంగారం,వెండి దిగుమతులపై సుంకం ప్రభావం
బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం పెంచిన కస్టమ్స్ సుంకం ప్రభావం జూలై గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. జూలైలో బంగారం దిగుమతులు 4.77 శాతం మాత్రమే పెరిగి 416 కోట్ల డాలర్లకు చేరాయి.
ఇక వెండి దిగుమతుల్లో మాత్రం భారీ క్షీణత నమోదైంది. ఇవి ఏకంగా 66.1 శాతం తగ్గి 17.16 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.
విలువైన లోహాల దిగుమతులపై విధించే సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మే 13న 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.
ఈ నిర్ణయం తర్వాత దిగుమతులపై ప్రభావం కనిపించినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
వివరాలు
అమెరికా, చైనాకు ఎగుమతుల్లో వృద్ధి
జూలైలో అమెరికాకు భారత్ ఎగుమతులు 12.85 శాతం పెరిగి 902 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
చైనాకు ఎగుమతులు మాత్రం మరింత వేగంగా పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన 64.57 శాతం వృద్ధి చెంది 220 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
అయితే ఈ రెండు దేశాల నుంచి భారత్ చేసుకున్న దిగుమతులు కూడా జూలైలో పెరిగాయి.
చైనా నుంచి దిగుమతులు 34.42 శాతం పెరిగి 1,467 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
అమెరికా నుంచి దిగుమతులు 18.11 శాతం పెరిగి 550 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
దీంతో ఎగుమతులు పెరిగినప్పటికీ దిగుమతుల వేగవంతమైన వృద్ధి కారణంగా దేశ వాణిజ్య లోటు గణనీయంగా పెరిగింది.