
India: నేటి నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం.. వాషింగ్టన్ చేరుకున్న భారత బృందం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మరో విడత చర్చలు నేటి నుంచి అమెరికాలోని వాషింగ్టన్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భారత వాణిజ్యశాఖ అధికారులతో కూడిన ప్రతినిధి బృందం అక్కడికి చేరుకుంది. అయితే ఈ బృందానికి చీఫ్ నెగోషియేటర్గా వ్యవహరిస్తున్న వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ బుధవారం వారితో కలవనున్నారు. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ ముఖ్యమైన చర్చలు గురువారం నాటికి ముగియనున్నాయి. వ్యవసాయం, ఆటో మొబైల్ రంగాల్లో కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఇరు దేశాల ప్రతినిధి బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అదనపు టారిఫ్ల అమలును వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 1వ తేదీ వరకు పలు దేశాలకు గడువును పొడిగించింది.
వివరాలు
26 శాతం టారిఫ్లను తొలగించాలంటూ అమెరికా విజ్ఞప్తి
భారత్ అయితే ఈ చర్చల్లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ప్రయత్నిస్తోంది. ముందుగా ఈ ఏడాది ఆగస్టు నాటికి మొదటి విడత ఒప్పందాన్ని సాధించాలని, ఆ తర్వాత చర్చలు కొనసాగించి సంపూర్ణ ఒప్పందానికి చేరాలని భావిస్తోంది. వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో భారత్ టారిఫ్ రాయితీలను అమెరికాకు అందించడానికి ఆసక్తి చూపడం లేదు. ఏకంగా ఈ రంగాల్లో భారత్ ఇప్పటివరకు ఏ దేశానికీ రాయితీలను మంజూరు చేయలేదు. మరోవైపు 26 శాతం టారిఫ్లను తొలగించాలంటూ అమెరికా నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది. స్టీల్ ఉత్పత్తులపై 50 శాతం, ఆటోమొబైల్ రంగంపై 25 శాతం టారిఫ్లను కూడా తొలగించాలంటూ అమెరికా భారత ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తోంది.