Page Loader
Remittance tax to 1 pc: అమెరికాలో భారతీయులకు భారీ ఊరట..  రెమిటెన్స్ పన్ను 1 శాతానికి తగ్గింపు 
అమెరికాలో భారతీయులకు భారీ ఊరట.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికి తగ్గింపు

Remittance tax to 1 pc: అమెరికాలో భారతీయులకు భారీ ఊరట..  రెమిటెన్స్ పన్ను 1 శాతానికి తగ్గింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు తాజాగా ఎంతో ఉపశమనం లభించింది. భారత్‌లోని కుటుంబ సభ్యులకు పంపే డబ్బుపై విధించనున్న రెమిటెన్స్ పన్నును కేవలం 1 శాతానికి పరిమితం చేయాలని తాజా ముసాయిదాలో పేర్కొనబడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'లో మొదట ఈ పన్ను రేటును 5 శాతంగా నిర్ధారించారు. కానీ తాజా సంస్కరణలో దానిని 1 శాతానికి తగ్గించారు.ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం,బ్యాంక్ ఖాతాల ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే డబ్బు బదిలీలను ఈ పన్ను నుంచి మినహాయించారు. అంటే,ఈ పన్ను కేవలం మనీ ఆర్డర్‌లు, క్యాషియర్ చెక్కులు వంటి పద్ధతుల ద్వారా నగదు పంపించే వారికి మాత్రమే వర్తించనుంది.

వివరాలు 

రూ.13,600 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం

ఈ ఏడాది మేలో అమెరికా నుంచి భారత్‌కు డబ్బులు పంపే వారికి 5 శాతం రెమిటెన్స్ పన్ను విధించాలని ప్రతిపాదించడంతో చాలామంది భారతీయులు ఆందోళనకు గురయ్యారు. అమెరికా పౌరులు కాకుండా,హెచ్1బీ వీసా దారులు, గ్రీన్‌కార్డు కలిగిన వ్యక్తులు విదేశాలకు పంపే మొత్తాలపై ఈ పన్ను వర్తించనుందని బిల్లులో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన వల్ల ఏడాదికి సుమారుగా 1.6 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.13,600 కోట్లు)ప్రభుత్వానికి ఆదాయంగా రావచ్చని అంచనా వేసిన విషయం గమనార్హం. ఇటీవల ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ఈ బిల్లు, తాజాగా సెనెట్‌ దశను కూడా దాటింది. అయితే ప్రతినిధుల సభకు చేరేసరికి 5 శాతం పన్నును 3.5 శాతానికి తగ్గించారు.

వివరాలు 

ఈ బిల్లుకు సెనెట్‌లో కేవలం స్వల్ప మెజారిటీ 

ఇక సెనెట్‌కు వచ్చిన కొత్త వెర్షన్‌లో దానిని మరింతగా తగ్గించి 1 శాతంగా పేర్కొనడం భారతీయులకు తాత్కాలిక ఊరటగా నిలిచింది. సెనెట్‌లో ఈ బిల్లు కేవలం స్వల్ప మెజారిటీతో (51-49 ఓట్లు) ఆమోదం పొందింది. గమనించదగ్గ విషయం ఏమంటే, ఇద్దరు రిపబ్లికన్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లులో ఆహార కూపన్ల తగ్గింపు, మెడికల్ ఎయిడ్‌లో కోతలు, అలాగే 3.8 ట్రిలియన్ డాలర్ల పన్ను రాయితీల వంటి అంశాలు కొన్ని రిపబ్లికన్ల విభేదానికి కారణమయ్యాయి. ప్రస్తుతం బిల్లు మళ్లీ ప్రతినిధుల సభకు చేరనుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాతే అది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లుతుంది.