లాభాల్లో ఇన్ఫోసిస్ టాప్.. ఏకంగా 11శాతం వృద్ధి
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసింది. దీని కంటే ముందుగా టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ తమ ఫలితాలను ప్రకటించాయి. ఇన్ఫోసిస్ క్యూ1లో రూ.5,945 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం విశేషం. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 11 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,362 కోట్ల నికర లాభాన్ని వెల్లడించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ కంపెనీ ఆదాయం శాతం రూ.34,470 కోట్ల నుంచి రూ.37,933 కోట్లకు పెరిగింది. అలాగే FY24 ఆదాయ అంచనాలను కంపెనీ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
ఆదాయ వృద్ధి అంచనాల్లో ఇన్ఫోసిస్ కోత
ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాల్లో ఇన్ఫోసిస్ కోత పెట్టడం గమనార్హం. 2023-24 సంవత్సరానికి గానూ ఆదాయ వృద్ధి 1 - 3.5 శాతంగా ఉండనుంది. అంతకుముందు కంపెనీ ఆదాయ అంచనాలను 4-7 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులే దీనికి కారణమని ఇన్ఫోసిస్ తెలిపింది. అదే విధంగా జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నామని ఇన్ఫోసిస్ పేర్కొంది. అయితే మార్చిలో ముగిసిన త్రైమాసికంలో 2.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది అత్యధికం. మార్చి త్రైమాసికంలో 20.9 శాతంగా ఉన్న వలసల రేటు 17.3 శాతానికి తగ్గిందని కంపెనీ పేర్కొంది.