
Stock market: లాభాల పంట పండిన మార్కెట్లు.. 700 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారిన వేళ, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు రాణించాయి. చమురు ధరలు దిగిరావడం కూడా మన మార్కెట్ సూచీలకు కలిసొచ్చింది. అన్ని రంగాల షేర్లు రాణించగా, ముఖ్యంగా ఐటీ, మీడియా రంగ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లు కూడా ఒకటిన్నర శాతం వరకు లాభపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా ఎగసింది, నిఫ్టీ 25,250 స్థాయిని చేరువయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలమైన సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 82,448.80 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు: 82,055.11) కొంత లాభంలో ప్రారంభమైంది.
Details
200 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
రోజంతా లాభాల జోరుతో కదిలిన సూచీ ఇంట్రాడేలో 82,815.91 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 700 పాయింట్ల లాభంతో 82,755.51 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 200 పాయింట్లు పెరిగి 25,244.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.07గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బీఈఎల్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మినహా మిగతా అన్ని షేర్లు లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా టైటాన్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 67.60 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 3,340 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.