LOADING...
Meta: మెటాలో భారీ లేఆఫ్‌లు.. 700 మందికి షాక్‌, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8600 కోట్ల బెనిఫిట్స్
ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8600 కోట్ల బెనిఫిట్స్

Meta: మెటాలో భారీ లేఆఫ్‌లు.. 700 మందికి షాక్‌, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8600 కోట్ల బెనిఫిట్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) ప్రభావంతో టెక్‌ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా మెటా ప్లాట్‌ఫారమ్స్ మరోసారి లేఆఫ్‌లు చేపట్టి సుమారు 700 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇదే సమయంలో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు కొత్త స్టాక్‌ ఆప్షన్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. పలు విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు రియాల్టీ ల్యాబ్స్‌, సేల్స్‌, రిక్రూటింగ్‌, ఫేస్‌బుక్‌ విభాగాల్లో పనిచేస్తున్న 700 మందికి పైగా ఉద్యోగులను మెటా తొలగించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ The New York Times ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా రియాల్టీ ల్యాబ్స్‌ విభాగంలో ఈ ఏడాది ఇది రెండోసారి లేఆఫ్‌లు జరగడం గమనార్హం. ఇదే విభాగం నుంచి జనవరిలోనే దాదాపు 1000 మందిని కంపెనీ తొలగించింది.

వివరాలు 

ఏఐపై ఫోకస్‌.. ఉద్యోగాల్లో కోత

ఏఐ రంగంలో పెట్టుబడులను పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని మెటా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొత్తం మీద సుమారు 16 వేల మంది వరకు లేఆఫ్‌లు ఇవ్వాలనే ప్రణాళికలో భాగంగానే తాజా తొలగింపులు చేపట్టినట్లు సమాచారం. అయితే, ఉద్యోగాలు కోల్పోయిన కొందరికి కంపెనీ లోపలే ఇతర విభాగాల్లో అవకాశాలు కల్పించినట్లు కూడా తెలుస్తోంది.

వివరాలు 

టాప్‌ ఉద్యోగులకు భారీ స్టాక్‌ ఆప్షన్లు

ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తూనే, మరోవైపు కీలక ఎగ్జిక్యూటివ్‌లను నిలుపుకోవడానికి మెటా కొత్త ప్రోత్సాహకాలు ప్రకటించింది. లేఆఫ్‌ల ప్రకటనకు కేవలం కొన్ని గంటల ముందే టాప్‌ అధికారులకు కొత్త స్టాక్‌ ఆప్షన్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కొంతమంది సీనియర్‌ ఉద్యోగులకు వచ్చే ఐదేళ్లలో సుమారు 921 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8,600 కోట్లు) వరకు వేతన ప్రయోజనాలు పెరగనున్నాయి. ఏఐ కాలంలో అత్యున్నత నైపుణ్యాలున్న ఉద్యోగులు సంస్థను విడిచిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

వివరాలు 

సోషల్‌ మీడియా కేసులో మెటాకు షాక్

ఇదిలా ఉండగా, సోషల్‌ మీడియా వ్యసనం కేసులో మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. YouTubeతో కలిసి మెటాపై నమోదైన కేసులో కాలిఫోర్నియా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్లాట్‌ఫామ్‌ల డిజైన్‌ కారణంగా ఓ యువతి సోషల్‌ మీడియాకు బానిసై, ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతిందన్న ఆరోపణలను కోర్టు సమర్థించింది. ఈ కేసులో మెటా, యూట్యూబ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించాయని తేల్చింది. దీంతో మొత్తం 6 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించగా, అందులో 70 శాతం మెటా, 30 శాతం యూట్యూబ్‌ చెల్లించాలని ఆదేశించింది.

Advertisement