Page Loader
Hurun Global Indians: గ్లోబల్‌ లీడర్లలో సత్య నాదెళ్ల అగ్రస్థానంలో, 2వ స్థానంలో పిచాయ్.. హురున్‌ గ్లోబల్‌ ఇండియన్‌ లిస్ట్‌-2024 విడుదల 
గ్లోబల్‌ లీడర్లలో సత్య నాదెళ్ల అగ్రస్థానంలో, 2వ స్థానంలో పిచాయ్.. హురున్‌ గ్లోబల్‌ ఇండియన్‌ లిస్ట్‌-2024 విడుదల

Hurun Global Indians: గ్లోబల్‌ లీడర్లలో సత్య నాదెళ్ల అగ్రస్థానంలో, 2వ స్థానంలో పిచాయ్.. హురున్‌ గ్లోబల్‌ ఇండియన్‌ లిస్ట్‌-2024 విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ మూలాలు కలిగి, విదేశాల్లో విజయవంతంగా రాణిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ మరియు సీఈఓ సత్య నాదెళ్ల అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత సుందర్ పిచాయ్, నీల్ మోహన్ వంటి ప్రముఖులు ఉన్నారు. హెచ్‌ఎస్‌బీసీ-హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2024 ద్వారా ఈ వివరాలు వెల్లడించబడ్డాయి. హురున్ ప్రపంచంలోని భారతీయ మూలాలున్న వ్యక్తుల నేతృత్వంలో నడుస్తున్న 200 అగ్రగామి కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కనీసం 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,600 కోట్ల) మార్కెట్ విలువ కలిగిన కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సంస్థల మార్కెట్ విలువ మొత్తం 10 లక్షల కోట్ల డాలర్లకు చేరువగా ఉంది.

వివరాలు 

ఛానల్ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్

ఈ 200 కంపెనీలకు 226 మంది సీఈఓలు, ఎండీలు, వ్యవస్థాపకులు ఉన్నారు. వీరందరూ విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులే. ఈ జాబితాలో: ఛానల్ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిలిచారు. జాబితాలోని 101 మంది ప్రవాసులు హురున్ గ్లోబల్ ఇండియన్స్ రిచ్ లిస్ట్‌లో కూడా చోటు సంపాదించారు. మిత్తల్ కుటుంబం రూ.1,84,000 కోట్ల సంపదతో మొదటి స్థానంలో ఉంది. గోపీచంద్ హిందుజా కుటుంబం రూ.1,78,000 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అరబిందో ఫార్మా సహవ్యవస్థాపకుడు పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి (న్యూజెర్సీ)రూ. 31,100 కోట్ల సంపదతో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. ఇక అత్యధికంగా 37 మంది శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తుండగా,లండన్‌లో 8 మంది,దుబాయ్‌లో 6 మంది ఉన్నారు.

వివరాలు 

 స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినవారు 20 మంది 

జాబితాలో అత్యంత పిన్న వయస్కుడిగా, కంయూర్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ అయిన 27 ఏళ్ల తనయ్ టాండన్ నిలిచారు. మొత్తం జాబితాలోని టాప్ 10 వ్యక్తులు నిర్వహిస్తున్న కంపెనీలు 73% విలువను కలిగి ఉన్నాయి. జాబితాలో 57% మంది తొలి తరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఉండగా, మిగతా వారు వృత్తినిపుణులు , వారసులు. ఈ జాబితాలోని 12 మంది మహిళలు హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2024లో కూడా ఉన్నారు. విద్యా నేపథ్యం: జాబితాలోని 62% మంది భారతదేశంలో అండర్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 77% మంది అమెరికాలో పీజీ పూర్తి చేశారు. అండర్‌గ్రాడ్యుయేషన్‌లో ఐఐటీ మద్రాస్ నుంచి 14 మంది ఉంటే, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విషయంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినవారు 20 మంది ఉన్నారు.