LOADING...
RBI: 4.6 ఎకరాలకు రూ.3,472 కోట్లు.. MMRCLతో కళ్లు చెదిరే డీల్‌
4.6 ఎకరాలకు రూ.3,472 కోట్లు.. MMRCLతో కళ్లు చెదిరే డీల్‌

RBI: 4.6 ఎకరాలకు రూ.3,472 కోట్లు.. MMRCLతో కళ్లు చెదిరే డీల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ ముంబైలోని నారీమన్ పాయింట్ ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 4.61 ఎకరాల భూమిని అత్యధిక ధరలో కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించి ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు RBI ₹3,472 కోట్లు చెల్లించింది. దీంతో ఈ ఏడాది భూమి కొనుగోళ్లలో ఇదే అత్యధిక ధర అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. RBI కొనుగోలు చేసిన భూమి మంత్రాలయ, బాంబే హైకోర్టు, కొన్ని ప్రముఖ కార్పొరేట్ హెడ్‌క్వార్టర్లకు సమీపంలో ఉంది.

వివరాలు 

 నారీమన్ పాయింట్‌లో తెర పైకి వచ్చిన మొట్టమొదటి భారీ భూవేలం

జాతీయ మీడియా కథనాల ప్రకారం, మొదట ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆ భూమిని వేలం ద్వారా విక్రయించాలనుకున్నది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో ప్రణాళిక రచించింది. 1970ల్లో ప్రణాళికాబద్ధంగా ఏర్పడిన వాణిజ్య కేంద్రంగా నారీమన్ పాయింట్ ఎదిగినప్పటి తర్వాత ఇది జరిగిన మొదటి భారీ భూవేలం. అయితే, ఆ టెండర్ రద్దయింది. RBI తమ హెడ్‌క్వార్టర్స్ విస్తరణకు ఆసక్తి చూపడం కారణంగా ఈ భూమిని నేరుగా కొనుగోలు చేసింది. తాజా ఒప్పందం సెప్టెంబర్ 5న రిజిస్టర్ అయ్యింది. అందుకోసం ₹208 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.

వివరాలు 

భారత ఆర్థిక రాజధానిలో కేంద్ర బ్యాంకు ఉనికి బలోపేతం

ఈ విలువైన భూమి కొనుగోలుతో RBI ముంబైలో తమ రియల్ ఎస్టేట్ ఆస్తులను విస్తరించింది. ముంబై మింట్ రోడ్‌లో RBIకి ఇప్పటికే ఉన్న హెడ్‌క్వార్టర్స్ సహా ఇతర స్థిరాస్తులు కూడా ఉన్నాయి. కేంద్ర బ్యాంకు ఈ కొత్త భూమిని సంస్థాగత అవసరాల కోసం అభివృద్ధి చేయవచ్చు. ఈ చర్య భారత ఆర్థిక రాజధానిలో RBI ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది. అదేవిధంగా, ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నగరంలో మరిన్ని ప్రాజెక్టులను విస్తరించాలనుకుంటోంది. ఈ ఉద్దేశ్యానికి అనుగుణంగా దక్షిణ,మధ్య ముంబైలోని విలువైన స్థలాలను విక్రయించడం మొదలుపెట్టింది. వీటి ద్వారా వచ్చిన ఆదాయం ముంబైలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఉపయోగపడుతుంది.