
Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్ను అధిగమించి మొదటిస్థానంలో..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన సంస్థగా నివిడియా (Nvidia) కొత్త రికార్డు సృష్టించింది.
కంపెనీ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావంతో మంగళవారం మార్కెట్లలో షేర్లు బలంగా రాణించాయి.
మంగళవారం ట్రేడింగ్లో ఎన్విడియా షేర్లు 3.4 శాతం పెరిగాయి.
ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ 3.45 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది.
ఇది సుమారుగా రూ.296.22 లక్షల కోట్లు అవుతుంది. ఇప్పటివరకు ఈ స్థానాన్ని కొనసాగించిన మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది.
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మార్కెట్ క్యాపిటలైజేషన్ను భారీగా పెంచుకున్న ఎన్విడియా, ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది.
వివరాలు
ఎన్విడియా ఏఐకు అవసరమైన మౌలిక వనరుల నిర్మాణంపైన కూడా దృష్టి
ఏప్రిల్తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఎన్విడియా ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ ఆదాయం 44.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇది సుమారుగా రూ.3.78 లక్షల కోట్లు. గత త్రైమాసికంతో పోలిస్తే 12 శాతం వృద్ధి కాగా, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 69 శాతం పెరుగుదల నమోదైంది.
వాణిజ్య ఆంక్షలు, కఠినమైన నియంత్రణల మధ్య కూడా కంపెనీ ఈ స్థాయి వృద్ధిని సాధించగలగడం గమనార్హం.
ప్రస్తుతం ఎన్విడియా కేవలం చిప్ల తయారీలోనే కాకుండా, ఏఐకు అవసరమైన మౌలిక వనరుల నిర్మాణంపైన కూడా దృష్టి సారించింది.
రాబోయే నాలుగు సంవత్సరాలలో సుమారు అర ట్రిలియన్ డాలర్ల విలువైన ఏఐ సూపర్ కంప్యూటర్లు, డేటా సెంటర్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
ఎన్విడియా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరడం ఈ ఏడాది ఇది మూడోసారి
ఈ క్రమంలోనే మే నెలలో ఎన్విడియా 'స్టార్గేట్ యూఏఈ' అనే ప్రాజెక్టును ప్రకటించింది.
దీనిద్వారా అబుదాబీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లు ఏర్పడనున్నాయి.
ఈ ప్రాజెక్టును ఓపెన్ఏఐ, ఒరాకిల్ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యంగా అమలు చేయనున్నారు.
ఇదే కాకుండా, ఎన్విడియా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరడం ఈ ఏడాది ఇది మూడోసారి.
గతంలో జనవరి 24న ఈ ఘనతను సాధించింది. అయితే, అనంతరం తన స్థానాన్ని తాత్కాలికంగా కోల్పోయింది.
కానీ, ఏఐ చిప్లకు పెరుగుతున్న డిమాండ్, గణనీయమైన ఆదాయ వృద్ధితో మళ్లీ మొదటి స్థానాన్ని తిరిగి పొందడంలో విజయవంతమైంది.