Ratnadeep: ఐపీవోకు రత్నదీప్ రిటైల్.. సెబీకి పత్రాల సమర్పణ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ప్రముఖ సూపర్మార్కెట్ చైన్గా గుర్తింపు పొందిన రత్నదీప్ రిటైల్ షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసింది. ఈ ఐపీఓలో భాగంగా ₹400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసి నిధులు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా షేర్ల జారీతో పాటు, ప్రమోటర్లు సందీప్ అగర్వాల్,మితేష్ భార్టియా,మనీష్ భార్టియా కలిపి 1,48,60,000 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను కొంత రుణాన్ని చెల్లించేందుకు,కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
వివరాలు
ఐపీఓకు ముందు గరిష్ఠంగా ₹80 కోట్ల వరకు ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్
స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్టింగ్ కావడం వల్ల ఇప్పటికే ఉన్న, కొత్తగా చేరే వినియోగదారులలో బ్రాండ్ గుర్తింపు మరింత పెరుగుతుందని, అలాగే భారతీయ ఈక్విటీ మార్కెట్లో కంపెనీ షేర్లకు పబ్లిక్ మార్కెట్ ఏర్పడుతుందని డీఆర్హెచ్పీలో పేర్కొంది. మర్చంట్ బ్యాంకర్లతో సంప్రదించి, ఐపీఓకు ముందు గరిష్ఠంగా ₹80 కోట్ల వరకు ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ చేపట్టే అవకాశాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. అది విజయవంతమైతే తాజా షేర్ల జారీ పరిమాణాన్ని అదే మేర తగ్గించనున్నట్లు తెలిపింది. ఈ ఐపీఓకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, యాక్సిస్ క్యాపిటల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తోంది.
వివరాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రత్నదీప్ రిటైల్
రత్నదీప్ రిటైల్ ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కిరాణా, ఆహార ఉత్పత్తులు, ఫ్యాషన్ విభాగాల్లో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. కంపెనీ వద్ద కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, త్వరగా వినియోగించే వస్తువులు (FMCG), నిత్యావసర సరుకులు, జనరల్ మెర్చండైజ్, దుస్తులు తదితర విభాగాల్లో 30 వేలకుపైగా స్టాక్ కీపింగ్ యూనిట్లు (SKUs) అందుబాటులో ఉన్నాయి. 2026 మార్చి నాటికి కంపెనీ మొత్తం 190 స్టోర్లను నిర్వహిస్తోంది. ఇందులో 'రత్నదీప్ - మైండ్ఫుల్ లివింగ్' పేరుతో నెయిబర్హుడ్ సూపర్మార్కెట్లు, 'రత్నదీప్ సెలెక్ట్' పేరుతో ప్రీమియం ఫుడ్ స్టోర్లు, అలాగే విలువ ఆధారిత హైపర్మార్కెట్ బ్రాండ్ నేషనల్ మార్ట్ ఉన్నాయి.
వివరాలు
'ఆర్డీ క్లిక్' పేరుతో ఆన్లైన్ విక్రయ వేదిక
అదనంగా 'ఆర్డీ క్లిక్' (RD Click) పేరుతో ఆన్లైన్ విక్రయ వేదికను కూడా నిర్వహిస్తోంది. 2026 మార్చి 31 నాటికి రత్నదీప్ బ్రాండ్ కింద 173 స్టోర్లు, దాదాపు 7.5 లక్షల చదరపు అడుగుల రిటైల్ విస్తీర్ణంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే నేషనల్ మార్ట్ బ్రాండ్ కింద 17 స్టోర్లు, సుమారు 4.6 లక్షల చదరపు అడుగుల రిటైల్ విస్తీర్ణంతో సేవలు అందిస్తున్నట్లు డీఆర్హెచ్పీలో పేర్కొంది.