LOADING...
IDFC First Bank: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం.. స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం.. స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్

IDFC First Bank: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం.. స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్‌ బి ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో వెలుగుచూసిన రూ.590 కోట్ల మోసం వ్యవహారంపై స్పందించారు. "ఈ పరిణామాలను మేము గమనిస్తున్నాం..ఇందులో ఎలాంటి వ్యవస్థాపరమైన(సిస్టమిక్)సమస్య లేదు" అని స్పష్టం చేశారు. బ్యాంకుల దగ్గర తగిన మూలధనం ఉందని, ప్రస్తుతం క్యాపిటల్ అడిక్వసీ రేషియో 17 శాతంగా ఉండగా అవసరం కేవలం 11.5 శాతమేనని చెప్పారు. ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 12:35 గంటల సమయానికి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు దాదాపు 16 శాతం పతనమై రూ.70.39 వద్ద ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో అయితే 20 శాతం వరకు క్షీణించాయి. ఆదివారం బ్యాంక్ వెల్లడించిన ప్రకారం, హర్యానా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో ఉద్యోగులు,ఇతరుల చేత రూ.590 కోట్ల మోసం జరిగినట్టు బయటపడింది.

వివరాలు 

నెట్ వర్త్‌పై 1% మాత్రమే ప్రభావం?.. ఫైనాన్షియల్ అనాలిస్ట్‌ల క్లారిటీ

ఈ విషయాన్ని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థకు తెలియజేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు బ్యాంక్ తెలిపింది. బ్రోకరేజ్ అంచనాల ప్రకారం ఈ మొత్తం బ్యాంక్ నెట్ వర్త్‌లో సుమారు 0.9 శాతం కాగా, 2026 ఆర్థిక సంవత్సరానికి ముందు పన్ను లాభాల్లో దాదాపు 20 శాతం సమానం. యూబీఎస్ అంచనా ప్రకారం ఈ అనుమానిత మొత్తం 2026 ఆర్థిక సంవత్సరపు పన్నుల తరువాత లాభాల్లో 22 శాతం వరకు ఉండొచ్చని, అయితే నెట్ వర్త్‌పై ప్రభావం కేవలం 1 శాతం వరకే పరిమితమవుతుందని పేర్కొంది. మోర్గాన్ స్టాన్లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, 2026 ఆర్థిక సంవత్సరపు ప్రీ-ట్యాక్స్ లాభాలపై సుమారు 20 శాతం ప్రభావం ఉండొచ్చని తెలిపింది.

వివరాలు 

చండీగఢ్ బ్రాంచ్‌లోనే ఫ్రాడ్.. సిస్టమ్ సమస్య కాదన్న జెఫరీస్

జెఫరీస్ మాత్రం ఈ సమస్య ఇతర కస్టమర్లకు వ్యాపించలేదని, ఇది వ్యవస్థాపరమైన సమస్య కాదని పెట్టుబడిదారులకు బ్యాంక్ నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందని సూచించింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో, హర్యానా ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాల్లో కొందరు ఉద్యోగులు అనధికారికంగా, మోసపూరిత లావాదేవీలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు బ్యాంక్ ఫైలింగ్‌లో తెలిపింది. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్ ఆదేశించింది. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ కోసం కేపీఎంజీని నియమించినట్టు వెల్లడించింది. ఇతర బ్యాంకుల్లోని సంబంధిత ఖాతాల నుంచి రికవరీ చేసే అవకాశముందని కూడా తెలిపింది.

Advertisement

వివరాలు 

IDFC, AU బ్యాంకులకు హర్యానా షాక్.. ప్రభుత్వ పనుల నుంచి తొలగింపు

ఇదిలా ఉండగా, హర్యానా ప్రభుత్వం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లను తక్షణమే ప్రభుత్వ పనుల జాబితా నుంచి తొలగించింది. ఇకపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ నిధులు జమ చేయడం, పెట్టుబడులు పెట్టడం, లావాదేవీలు నిర్వహించడం జరగదని ఆర్థిక శాఖ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. మరోవైపు, మల్హోత్రా మాట్లాడుతూ క్యాపిటల్ అడిక్వసీ మెరుగుపడిందని, ఎన్‌పీఏలు తగ్గాయని, 'వికసిత భారత్' లక్ష్యాల దిశగా దేశ అవసరాలను తీర్చగలమనే నమ్మకం ఉందని తెలిపారు. మనీ మార్కెట్, బ్యాంకింగ్, ప్రభుత్వ సెక్యూరిటీస్ మార్కెట్లకు దీర్ఘకాలిక లిక్విడిటీని అందిస్తూనే ఉంటామని చెప్పారు.

Advertisement