
Oil Prices: భగ్గుమన్న చమురు రేట్లు.. ఆసియా మార్కెట్లపై పెరుగుతున్న ఒత్తిడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఉద్ధృతమయ్యాయి. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. చమురు రేట్లు ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. తాజా ట్రేడింగ్లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7శాతం పెరిగి 79.12 డాలర్లకు చేరగా, యూఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8శాతం పెరిగి 75.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలో ఉన్నాయి. జపాన్ నిక్కీ సూచీ 0.6%, దక్షిణ కొరియా కోస్పి 1.4%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 0.7% నష్టపోయాయి.
Details
తీవ్ర ఒత్తిడిలో మార్కెట్లు
ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఎస్అండ్పీ 500 ఫ్యూచర్స్ 0.5%, నాస్డాక్ ఫ్యూచర్స్ 0.6% నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.1% తగ్గి 3,363 డాలర్లుగా ఉంది. ఈ పరిణామాల ప్రభావం భారత మార్కెట్లపైనా కన్పించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అణుకేంద్రాలపై అమెరికా బాంబుదాడులకు ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలమార్గాన్ని మూసివేయడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు భారత్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Details
యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం
ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ తదితర పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై దీని ప్రభావం పడొచ్చని అంటున్నారు. ఇప్పటికే భారత్ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు జరిగే ఎగుమతుల్లో తగ్గుదల కనిపిస్తోంది. యుద్ధం మరింత తీవ్రతరం అయితే, పశ్చిమాసియా దేశాలతో మన వాణిజ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.