Page Loader
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం 
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల సంకేతాలు, అలాగే మార్కెట్లు గరిష్ఠ స్థాయులకు చేరుకోవడంతో లాభాల స్వీకరణకు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. ఈ ప్రభావంతో సూచీలు నెగటివ్‌గా కదలాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా ప్రభుత్వ క్రెడిట్‌ రేటింగ్‌ను మూడీస్‌ ఏజెన్సీ AAA నుంచి AA1కి తగ్గించిందనే విషయం కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఐటీ సంస్థలకు ముఖ్యంగా అమెరికా మార్కెట్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుండటంతో, ఈ రేటింగ్‌ తగ్గింపుతో వాటి షేర్లపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా, నిఫ్టీ సూచీ 25 వేల మార్క్‌ దిగువకు చేరిపోయింది.

వివరాలు 

 సెషన్‌ ముగింపులో సెన్సెక్స్‌ 271.17 పాయింట్ల నష్టం 

సెన్సెక్స్‌ సూచీ ఉదయం 82,354.92 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఇది మునుపటి ముగింపు స్థాయి అయిన 82,330.59 పాయింట్లతో పోలిస్తే స్వల్పంగా ఎగబాకినట్లైంది. అనంతరం ఈ సూచీ రోజంతా ఓ నిశ్చిత శ్రేణిలోనే కదలాడింది. ఇంట్రాడే సమయంలో ఇది కనిష్టంగా 81,964.57 పాయింట్లు, గరిష్ఠంగా 82,424.10 పాయింట్ల మధ్య కదలాడింది. అంతిమంగా, సెషన్‌ ముగింపులో సెన్సెక్స్‌ 271.17 పాయింట్ల నష్టంతో 82,059 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ కూడా 74.35 పాయింట్లు కోల్పోయి 24,945.45 వద్ద ముగిసింది. విదేశీ మారకద్రవ్యాల క్రమంలో రూపాయి విలువ డాలరుతో పోల్చితే 85.40గా నమోదైంది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.72 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 షేర్లలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ల విషయానికి వస్తే, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.72 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3239 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.