Page Loader
Stock Market: రూ.7.5లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 
రూ.7.5లక్షల కోట్ల సంపద ఆవిరి..

Stock Market: రూ.7.5లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్‌ మార్కెట్లు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లోకి పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ,దేశీయంగా బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు సూచీలను కుదిపేశాయి. ఫలితంగా, సెన్సెక్స్‌ 950 పాయింట్లకు పైగా పడిపోయింది, అలాగే నిఫ్టీ 24,000 మార్క్‌ను కోల్పోయింది. బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదు చేసిన కంపెనీల మార్కెట్‌ విలువ ₹7.5 లక్షల కోట్ల మేర తగ్గింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌ ప్రారంభంలో సూచీలు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, కొంత సమయం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం 11 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 952.7 పాయింట్లు క్షీణించి 78,850.71 వద్ద ట్రేడ్‌ అవుతుంది.

వివరాలు 

భారత్‌-పాక్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను జాగ్రత్తగా గమనిస్తున్న  మదుపర్లు

అలాగే, నిఫ్టీ 324.7 పాయింట్లు తగ్గి 23,922.05 వద్ద కొనసాగుతోంది.బ్యాంక్‌ నిఫ్టీ 1.56% నష్టాల్లో ఉంది. నిఫ్టీ మీడియా 3.54%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 2.87%, నిఫ్టీ రియల్టీ 2.69% నష్టపోయాయి. ప్రధాన బ్యాంకులైన ఎస్‌బీఐ షేర్లు 2.71%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 0.62%, ఐసీఐసీఐ షేర్లు 0.42% మేర క్షీణించాయి. పహల్గాం దాడితో భారత్‌-పాక్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను మదుపర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. దీంతో వారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

లాభాలలో ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు

ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలు సాధించాయి. జపాన్‌ నిక్కీ 0.91%, దక్షిణ కొరియా కోస్పి 1.03%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్‌ సూచీ 0.75% లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఎస్‌అండ్‌పీ సూచీ 2.03%, నాస్‌డాక్‌ 2.74%, డోజోన్స్‌ 1.23% లాభపడ్డాయి.