Page Loader
Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 1500+ పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 
భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 1500+ పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేయడమే కాకుండా, కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను ఆ జాబితా నుంచి తొలగించడంతో గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ పరిణామం భారత మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా సెన్సెక్స్‌ 1500 పాయింట్లకు పైగా జంప్‌ కాగా, నిఫ్టీ సైతం 500 పాయింట్ల మేర ఎగసింది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల కలిపిన మార్కెట్‌ విలువ ఒక్క రోజులో రూ.8.7 లక్షల కోట్లు పెరిగి మొత్తం రూ.410.24 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్‌ ఉదయం 76,852.06 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

వివరాలు 

డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.77

ఇది మునుపటి ముగింపు స్థాయైన 75,157.26 పాయింట్లతో పోలిస్తే స్పష్టమైన వృద్ధిని చూపించింది. ట్రేడింగ్‌ సమయం మొత్తం లాభాల్లోనే కొనసాగిన ఈ సూచీ, ఇంట్రాడేలో 76,907.63 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 1577.63 పాయింట్ల లాభంతో 76,734.89 వద్ద ముగిసింది.నిఫ్టీ సైతం 500 పాయింట్లు పెరిగి 23,328.55 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.77గా నమోదైంది. సెన్సెక్స్‌కి చెందిన 30 షేర్లలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌,ఐటీసీ మినహా మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,టాటా మోటార్స్‌,ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌,అదానీ పోర్ట్స్‌ షేర్లు బలంగా ట్రేడ్‌ అయ్యాయి. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64డాలర్ల వద్ద ట్రేడవుతుండగా,బంగారం ఔన్సు ధర 3,242డాలర్ల వద్ద ఉంది.

వివరాలు 

మార్కెట్ల లాభాలకు కారణాలివే: 

అమెరికా ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను ప్రతీకార సుంకాల జాబితా నుంచి తొలగించడంతో మార్కెట్లలో కొనుగోళ్లకు మద్దతు లభించింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు సుమారు 3 శాతం పెరిగి సెన్సెక్స్‌ లాభాల్లో ముఖ్యపాత్ర వహించాయి. ఈ రెండు బ్యాంకుల వల్ల సెన్సెక్స్‌కి 638 పాయింట్ల మేర బలం లభించింది. ఆటోమొబైల్‌ రంగానికి కూడా సుంకాల నుంచి మినహాయింపు దొరికే అవకాశముందన్న అంచనాలతో నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 3 శాతం మేర లాభపడింది. ఇందులో సంవర్థనా మదర్‌సన్స్‌, భారత్‌ ఫోర్జ్‌, టాటా మోటార్స్‌ షేర్లు బాగా రాణించాయి.

వివరాలు 

మార్కెట్ల లాభాలకు కారణాలివే: 

నిన్నటి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో పాటు, నేడు ఆసియా మార్కెట్లు కూడా బలంగా కనిపించాయి. జపాన్‌, హాంకాంగ్‌, షాంఘై మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడడం వంటి పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లకు అనుకూలంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల విదేశీ పెట్టుబడులు భారత్‌కి చేరుతున్నాయి. రూపాయిపై ఒత్తిడి తగ్గుతోంది.