Silver: 2025లో వెండి రికార్డు ర్యాలీ.. అంచనాలకు అందని కారణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది బంగారం లేదా స్టాక్ మార్కెట్లపైనే దృష్టి సారించిన పెట్టుబడిదారులు ఒక కీలక అవకాశాన్ని కోల్పోయి ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2025లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కమోడిటీగా వెండి నిలిచింది. ఈ చారిత్రాత్మక ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తూ టాటా మ్యూచువల్ ఫండ్ తాజాగా విడుదల చేసిన నివేదికలోని కీలక అంశాలను ఈ ఆర్టికల్ వివరిస్తోంది.
Details
వెండి కేవలం పెరగలేదు.. అన్నింటినీ మించిపోయింది
2025లో వెండి ప్రదర్శన అసాధారణంగా నిలిచింది. ఏడాది ప్రాతిపదికన వెండి ధర సుమారు 161 శాతం పెరిగింది. ఇది బంగారం (సుమారు 66 శాతం), రాగి (సుమారు 44 శాతం) వంటి సాంప్రదాయ ఆస్తులను స్పష్టంగా అధిగమించింది. అంతేకాదు, బిట్కాయిన్, S&P 500 వంటి అధిక వృద్ధి ఆస్తుల కంటే కూడా వెండి మెరుగైన పనితీరును నమోదు చేసింది. ఒక దశలో వెండి ధర ఔన్సుకు $86.62 అనే రికార్డు స్థాయికి చేరుకుంది. అయితే, సంవత్సరాంతపు లాభాల స్వీకరణ, చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME) మార్జిన్ల పెంపు వంటి కారణాలతో ధర తరువాత ఔన్సుకు $72కి తగ్గింది.
Details
గ్రీన్ విప్లవానికి వెండి వెన్నెముక
వెండి ధరల పెరుగుదలకు పెట్టుబడులే కాకుండా పారిశ్రామిక రంగం నుంచి వస్తున్న బలమైన డిమాండ్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మొత్తం వెండి డిమాండ్లో సుమారు 50 శాతం పరిశ్రమల నుంచే వస్తోంది. ముఖ్యంగా సౌర ఫలకాలు (సోలార్ ప్యానెళ్లు), ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) వంటి గ్రీన్ టెక్నాలజీల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ బలమైన డిమాండ్ను తట్టుకునేందుకు మార్కెట్ ఆభరణాల డిమాండ్ను కొంత మేర తగ్గించడం, స్క్రాప్ వెండి సరఫరాను ప్రోత్సహించడం, ఇప్పటికే నిల్వలు కలిగినవారిని విక్రయాలకు ప్రేరేపించడం ద్వారా సమతుల్యత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న స్థిరమైన ఇంధన మార్పుతో వెండి భవిష్యత్తు ముడిపడటం ఈ లోహానికి కొత్త బలమైన కథనాన్ని ఇచ్చింది.
Details
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వెండి కొరత
వెండి మార్కెట్లో 'నిర్మాణాత్మక లోటు' స్పష్టంగా కనిపిస్తోంది. ఐదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వెండికి ఉన్న డిమాండ్, సరఫరాను మించిపోతోంది. 2025లో ఈ లోటు సుమారు 117.6 మిలియన్ ఔన్సులకు చేరుకుని పరిస్థితి తీవ్రతను చాటుతోంది. దీనికి ప్రధాన కారణం వెండి ఉత్పత్తి స్వభావమే. మొత్తం వెండిలో సుమారు 70 శాతం రాగి, సీసం, జింక్ వంటి ఇతర లోహాల తవ్వకాలలో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. దీంతో డిమాండ్ పెరిగినప్పటికీ ఉత్పత్తిని తక్షణమే పెంచడం సాధ్యం కావడం లేదు. గనుల ఉత్పత్తిలో స్తబ్దత, ఖనిజ నాణ్యత తగ్గడం, వెలికితీత ఖర్చులు పెరగడం వంటి అంశాలు కూడా సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
Details
చైనా నిర్ణయం మార్కెట్పై మరింత ఒత్తిడి
ప్రపంచంలో రెండవ అతిపెద్ద వెండి ఉత్పత్తిదారైన చైనా, 2026-2027నాటికి వెండి ఎగుమతులను పరిమితం చేయడం లేదా నిలిపివేయడం దిశగా కొత్త నిబంధనలను ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ కారణాలనే ఇందుకు ఆధారంగా చూపింది. కొత్త విధానం ప్రకారం, సంవత్సరానికి కనీసం 80 టన్నుల వెండిని ఉత్పత్తి చేసే ప్రభుత్వ ఆమోదిత పెద్ద సంస్థలకే ఎగుమతి లైసెన్స్లు జారీ చేయనున్నారు. దీని వల్ల ఇప్పటికే సంవత్సరానికి 2,500టన్నులకుపైగా ఉన్న ప్రపంచ వెండి లోటు, భవిష్యత్తులో 5,000టన్నులకుపైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం ధరలపై మరింత ఒత్తిడిని పెంచవచ్చని నివేదిక హెచ్చరిస్తోంది. భౌగోళిక రాజకీయ నిర్ణయాలు కూడా వెండి భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయని ఇది స్పష్టం చేస్తోంది.
Details
ఇన్వెస్టర్ల దృక్పథంలో పెద్ద మార్పు
2025లో వెండిపై పెట్టుబడిదారుల దృష్టికోణం గణనీయంగా మారింది. భవిష్యత్తులో వాస్తవ వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు, బంగారంతో పోలిస్తే వెండి తక్కువ విలువలో ఉందనే భావన ఇందుకు కారణాలుగా నిలిచాయి. మే నెల తర్వాత పెట్టుబడిదారులు బుల్లిష్గా మారి, వెండిలో దూకుడుగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ETF గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపుతున్నాయి. 2022 నుంచి 2024 వరకు ETF పెట్టుబడిదారులు సుమారు 170 మిలియన్ ఔన్సుల వెండిని విక్రయించగా, 2025లో ఈ ధోరణి పూర్తిగా తిరగబడింది. నవంబర్ నాటికి ETFలలోకి వచ్చిన పెట్టుబడులు, అక్టోబర్లో నమోదైన అవుట్ఫ్లోలను మించాయి. భారతదేశం ఈ ట్రెండ్లో కీలక పాత్ర పోషిస్తూ, 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద సిల్వర్ రిటైల్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్గా అవతరించింది.
Details
అస్తిరత మధ్య బుల్లిష్ భవిష్యత్తు?
బలమైన పారిశ్రామిక డిమాండ్, తీవ్ర సరఫరా పరిమితులు, పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలన్నీ కలసి వెండికి దీర్ఘకాలికంగా బుల్లిష్ దృక్పథాన్ని ఇస్తున్నాయి. అయితే, సమీప కాలంలో లాభాల స్వీకరణ, CME మార్జిన్ల పెంపు వంటి సాంకేతిక కారణాలతో ధరల్లో అస్తిరత, సవరణలు చోటుచేసుకునే అవకాశముందని నివేదిక హెచ్చరిస్తోంది. పారిశ్రామిక లోహంగా, సురక్షిత పెట్టుబడి సాధనంగా ద్వంద్వ పాత్ర పోషిస్తున్న వెండి, రాబోయే దశాబ్దంలో అత్యంత కీలక కమోడిటీగా మారుతుందా అన్న ప్రశ్నకు సమాధానం కాలమే ఇవ్వాల్సి ఉంది.