
Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, ఊహించిన దానికంటే అధికంగా కీలక వడ్డీ రేట్లను తగ్గించడం, అలాగే నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్ఆర్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న సానుకూల నిర్ణయాలు మార్కెట్ సెంటిమెంట్ను ఉత్తేజితంగా మార్చాయి. ఉదయం 9:30 గంటల సమయంలో, బీఎస్ఈ సెన్సెక్స్ 280 పాయింట్ల పెరుగుదలతో 82,469 వద్ద ట్రేడవుతూ కనిపించింది. అదే సమయంలో, ఎన్ఎస్ఈ నిఫ్టీ 88 పాయింట్లు ఎగిసి 25,091 వద్ద కొనసాగుతోంది. విదేశీ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ డాలర్కు 85.60గా నమోదైంది.
వివరాలు
సానుకూల ధోరణిలోనే ఆసియా మార్కెట్లు
నిఫ్టీ సూచీలో కొటక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించగా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు కూడా సానుకూల ధోరణిలోనే కొనసాగుతున్నాయి.