
Stock Market : స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ @ 24,800
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ షేర్ల మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నప్పటికీ.. మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు తర్వాత ఆ జోరు తగ్గించాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకిపైగా లాభంతో, నిఫ్టీ 24,800 మార్క్ కంటే పైగా ట్రేడింగ్ను ప్రారంభించింది. అయితే కొద్ది సేపటి తర్వాత ఈ లాభం కొంతమేర తగ్గింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 193.34 పాయింట్ల లాభంతో 80,911.35 వద్ద, నిఫ్టీ 55.45 పాయింట్ల పెరుగుదలతో 24,789.75 వద్ద ట్రేడింగ్ అవుతోంది. రూపాయి-డాలర్ మారకం విలువ 88.13 స్థాయిలో కొనసాగుతోంది.
వివరాలు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్ పై విధించిన ఆటో టారిఫ్లను 27.5 శాతం నుండి 15 శాతం వరకు తగ్గించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ పరిణామం ఆసియా-పసిఫిక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. జపాన్ నిక్కీ 1.39 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.26 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.58 శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ 0.17 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా గురువారం లాభాలతో ముగిశాయి. ఎస్అండ్పీ సూచీ 0.83 శాతం, నాస్డాక్ 0.98 శాతం, డోజోన్స్ 0.77 శాతం పెరుగుదలతో ముగిశాయి.