LOADING...
Cognizant: ఏఐ కంపెనీల జోరు.. నాస్‌డాక్‌-100లో చోటు కోల్పోయిన కాగ్నిజంట్
ఏఐ కంపెనీల జోరు.. నాస్‌డాక్‌-100లో చోటు కోల్పోయిన కాగ్నిజంట్

Cognizant: ఏఐ కంపెనీల జోరు.. నాస్‌డాక్‌-100లో చోటు కోల్పోయిన కాగ్నిజంట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ)విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల షేర్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఈ ప్రభావం ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజంట్‌పై మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక నాస్‌డాక్‌-100 సూచీ నుంచి కాగ్నిజంట్‌ బయటకు వెళ్లనుంది. ఏఐ బూమ్‌ కారణంగా వేగంగా ఎదుగుతున్న సంస్థలకు అవకాశం కల్పించేందుకు కొన్ని సాంప్రదాయ ఐటీ కంపెనీలను సూచీ నుంచి తొలగిస్తున్నట్లు నాస్‌డాక్‌ ప్రకటించింది. జూన్‌ 11న నాస్‌డాక్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కాగ్నిజంట్‌తో పాటు చార్టర్‌ కమ్యూనికేషన్స్‌, ఇన్స్‌మెడ్‌, వరిస్క్‌ అనలిటిక్స్‌, స్కేలర్‌ వంటి సంస్థలను కూడా నాస్‌డాక్‌-100 సూచీ నుంచి తొలగించనున్నారు. ఈ సూచీ ప్రపంచంలోని 100అతిపెద్ద బ్యాంకింగేతర కంపెనీల పనితీరును ప్రతిబింబించే కీలక ప్రమాణంగా గుర్తింపు పొందింది.

వివరాలు

ఏఐ బూమ్‌తో మారిన సమీకరణాలు

ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు ఏఐ మౌలిక వసతులు, అధునాతన సెమీకండక్టర్‌ టెక్నాలజీలు, చిప్‌ తయారీ సంస్థలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆయా కంపెనీల మార్కెట్‌ విలువలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నాస్‌డాక్‌-100లో చోటు దక్కించుకునే అర్హతను కొన్ని కొత్త సంస్థలు సాధించాయి. వాటిలో అస్టెరా ల్యాబ్స్‌, కోర్‌వీవ్‌, నెబియస్‌ గ్రూప్‌, రాకెట్‌ ల్యాబ్స్‌, టెరాడైన్‌ వంటి కంపెనీలు ఉన్నాయి.

వివరాలు

భారత్‌లోనూ ఐటీ షేర్లపై ఒత్తిడి

ఏఐ ప్రభావం భారత ఐటీ రంగంపైనా కనిపిస్తోంది. దేశీయంగా ఐటీ కంపెనీల షేర్లలోనూ గణనీయమైన ఊగిసలాటలు నమోదవుతున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా ఈ ఏడాది సెప్టెంబరులో నిఫ్టీ-50 సూచీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దాని స్థానంలో బీఎస్‌ఈ షేరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2026ప్రారంభం నుంచి ఇప్పటివరకు నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 25 శాతం వరకు నష్టపోయింది. దీంతో ఈ రంగం మార్కెట్‌ విలువలో రూ.7 లక్షల కోట్ల మేర కోత పడింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి కంపెనీలు కూడా గణనీయ స్థాయిలో మార్కెట్‌ విలువను కోల్పోయినట్లు మార్కెట్‌ గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement