US Lifts Sanctions: అమెరికా కీలక నిర్ణయం.. నాలుగు భారత కంపెనీలపై ఆంక్షల ఎత్తివేత
ఈ వార్తాకథనం ఏంటి
భారత్కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. రష్యా సంస్థలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించాయనే ఆరోపణల నేపథ్యంలో గతంలో ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్, లోకేష్ మెషీన్స్ లిమిటెడ్, గెలాక్సీ బేరింగ్స్, శౌర్య ఏరోనాటిక్స్ సంస్థలను నిషేధిత కంపెనీల జాబితాలో అమెరికా చేర్చింది. వీటిలో ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్, లోకేష్ మెషీన్స్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ఈ సంస్థల వ్యవహారాన్ని సమీక్షించిన అమెరికా ప్రభుత్వం, నాలుగు కంపెనీలపై అమల్లో ఉన్న ఆంక్షలను ఉపసంహరించుకుంది. గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ రోలర్ బేరింగ్స్, అసెంబ్లీ పరికరాలను రష్యా సంస్థలకు ఎగుమతి చేసిందనే ఆరోపణలతో 2024 అక్టోబర్లో అమెరికా ఆంక్షలు విధించింది.
వివరాలు
ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్పై ఆంక్షలు
అలాగే రాడార్ పరికరాలు, రేడియో నావిగేషన్కు సంబంధించిన ఉపకరణాలు,రేడియో రిమోట్ కంట్రోల్ పరికరాలను రష్యాకు సరఫరా చేసిందనే కారణంతో శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్పై కూడా చర్యలు తీసుకుంది. ఇక ఇప్పటికే అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న రష్యాకు చెందిన ఆర్టెక్స్ లిమిటెడ్కు 100కు పైగా మైక్రోఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సరఫరా చేసిందనే ఆరోపణలతో ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్పై ఆంక్షలు అమలు చేసింది. అదే విధంగా రష్యా తయారీ సంస్థలకు డజన్ల కొద్దీ మెషిన్ టూల్స్ను రవాణా చేసిందనే కారణంతో లోకేష్ మెషీన్స్ లిమిటెడ్ను కూడా నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. అయితే తాజా సమీక్ష అనంతరం ఈ నాలుగు భారతీయ కంపెనీలపై ఉన్న ఆంక్షలను అమెరికా పూర్తిగా ఎత్తివేసింది.