Page Loader
Vijay Mallya: 'బ్యాంకులు అనేక రెట్లు రుణాలను రికవరీ చేస్తున్నాయి'.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్‌ మాల్యా
కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్‌ మాల్యా

Vijay Mallya: 'బ్యాంకులు అనేక రెట్లు రుణాలను రికవరీ చేస్తున్నాయి'.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్‌ మాల్యా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్‌ మాల్యా (Vijay Mallya) కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు వసూలు చేశాయని, దానికి సంబంధించిన అకౌంట్‌ స్టేట్‌మెంట్లను అందించాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే, తనతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న యూబీహెచ్‌ఎల్‌, ఇతర సంస్థల నుంచి వసూలు చేసిన మొత్తాల వివరాలను కూడా అందించాలని ఆయన కోరారు. తాజాగా ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.ఈ సందర్భంగా, మాల్యా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.

వివరాలు 

రూ.14,131 కోట్ల విలువైన ఆస్తులు రికవరీ చేసిన  బ్యాంకులు 

కింగ్‌ఫిషర్‌ ఎయిర్లైన్స్‌ సుమారు రూ.6,200 కోట్ల రుణాన్ని తీసుకోగా, ఈ రుణానికి సంబంధించి రూ.14,000 కోట్లను బ్యాంకులు రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. "ఈ విషయాన్ని లోక్‌సభలో ఆర్థిక మంత్రి తెలియజేశారు. మాల్యాకు చెందిన రూ.14,131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని ఆమె తెలిపింది. ఆయన తీసుకున్న రుణం నుంచి దాదాపు రూ.10,200 కోట్లను చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు. మొత్తం రుణం చెల్లించినప్పటికీ, రికవరీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాల్యాకు సంబంధించిన రికవరీ చర్యలపై స్టే విధించాలని కోర్టును కోరుతున్నాను. ఈ విషయానికి సంబంధించిన అన్ని బ్యాంకుల నుంచి అకౌంట్‌ స్టేట్‌మెంట్లను అందించాలని అభ్యర్థించారు" అని న్యాయవాది తెలిపారు.

వివరాలు 

మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నం 

వాదనలు విన్న న్యాయస్థానం, ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన ఇవ్వాలని గడువు విధించింది. ఇదిలా ఉండగా, కింగ్‌ఫిషర్‌ ఎయిర్లైన్స్‌ రుణాల విషయంలో మోసం చేసినట్లు విజయ్‌ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశం విడిచి వెళ్లిపోయిన ఆయన మార్చి 2016 నుంచీ బ్రిటన్‌లో నివసిస్తున్నారు. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో, బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చారు.