Paytm: ఆర్బీఐ ఆంక్షలపై జోక్యం చేసుకోలేం: పేటీఎంకు కేంద్రం సూచన
ఆర్బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(PPBL) తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కలిశారు. దాదాపు 10 నిమిషాలు పాటు విజయ్ శేఖర్ శర్మ.. నిర్మలా సీతారామన్తో మాట్లాడినట్లు విశ్వసనీయం వర్గాల సమాచారం. అయితే ఆర్బీఐ విధించిన ఆంక్షల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆంక్షల విషయంలో ప్రభుత్వ పాత్ర లేదని సీఈఓకు మంత్రి చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐతోనే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించాల్సిందిగా పేటీఎంను నిర్మల కోరినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం నుంచి లావాదేవీలు బంద్
ఫిబ్రవరి 29, 2024 తర్వాత తన కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లలో డిపాజిట్లు లేదా టాప్-అప్లను అంగీకరించకుండా పేటీఎంపై ఆర్బీఐ నిషేదం విధించింది. పేటీఎంకు చెందిన Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ సమగ్ర ఆడిట్ నివేదిక నిబంధనలకు అనుగూనంగా లేకపోవడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎంలో ఎటువంటి ఖాతాలను నిర్వహించలేరని ఆర్బీఐ చెప్పింది. మొబిలిటీ కార్డ్లు ప్రాథమికంగా ట్రాన్సిట్ కార్డ్లు, వీటిని షాపింగ్ బిల్లులు, పార్కింగ్ ఛార్జీలు, ఏటీఎం ఉపసంహరణలు, మెట్రో, బస్సు ప్రయాణాలు, ఇంధనం లేదా ఆహార బిల్లులు, మరిన్నింటిని చెల్లించడానికి ఉపయోగించవచ్చని చెప్పంది. వాలెట్ల ద్వారా సహా డెబిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు అనుమతించబడవని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.