ఇకపై 30శాతం వేతన పెంపుతో ఉద్యోగులను నియమించుకోం: విప్రో కీలక ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నఉద్యోగుల తొలగింపు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విప్రో సీహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ కీలక ప్రకటన చేశారు. కంపెనీ తన ఉద్యోగుల నుంచి ఏమి ఆశిస్తోంది అనే విషయాలను ఆయన వెల్లడించారు. ఐటీలో ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరొక సంస్థకు మారినప్పుడు 30శాతం హైక్ తో జాయిన్ కావడం సర్వసాధారణం. అయితే ఇప్పడు విప్రోలో ఆ పరిస్థితి ఉండదని సౌరభ్ గోవిల్ చెబుతున్నారు. 30శాతం హైక్ ను తాము కొత్త ఉద్యోగులకు ఆఫర్ చేయబోమని ఆయన వెల్లడించారు. కానీ ప్రస్తుతం, ఉత్పాదక ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి సముచిత నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు మంచి హైక్ ఉంటుందని సౌరభ్ గోవిల్ చెప్పారు.
ఉద్యోగులు వారానికి మూడురోజులు ఆఫీసుకు రావాల్సిందే: గోవిల్
హెచ్ఆర్ కు సంబంధించిన చాలా విధులను ఆటోమేట్ చేయడం విప్రో లక్ష్యం అని గోవిల్ నొక్కి చెప్పారు. కంపెనీ 80 శాతం ప్రశ్నలను బాట్ల ద్వారా పరిష్కరించాలని కోరుకుంటుందని స్పష్టం చేశారు. తద్వారా హెచ్ఆర్ నిపుణులు మేనేజర్లకు కోచ్లుగా వ్యవహరిస్తారు. తమ ఉద్యోగులు కార్యాలయం నుంచి పని చేయాలని తాము ఆశిస్తున్నట్లు గోవిల్ చెప్పారు. ప్రస్తుతం ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయానికి కచ్చితంగా రావాలని ఆయన కోరారు. అయితే విప్రో ఇంకా ఆఫీస్ నుంచి పని చేయడాన్ని తప్పనిసరి చేయలేదు. కానీ ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావాలని పదే పదే రిమైండర్లను మాత్రం పొందుతున్నారని చెప్పారు.