
Hema Committee report: హేమ కమిటీ నివేదిక: 35 కేసులను మూసివేస్తున్నామని హైకోర్టుకు సిట్ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ చలనచిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవమానాలను వెల్లడించడంలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక కీలకపాత్ర వహించింది. ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన అనంతరం నమోదైన 35 కేసులపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఈ 35 కేసులన్నింటిని మూసివేస్తున్నట్లు సిట్ కేరళ హైకోర్టుకు తెలియజేసింది. సంబంధిత కేసులకు సంబంధించి బాధితులెవరూ వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వల్లే కేసులను మూసివేయాల్సి వస్తోందని సిట్ స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా విచారణ జరిపిన న్యాయస్థానం, ప్రస్తుతానికి ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని, అలాగే ఆ కేసులను మూసివేయాలని ఆదేశించింది.
వివరాలు
2017 నటి అపహరణ ఘటనకు నేపథ్యం
ఇంతకుముందు, 2017లో కొచ్చి నగరంలో ఓ ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్కు గురైన ఘటన సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఆమెపై రౌడీలను పెట్టించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలతో నటుడు దిలీప్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంగా, మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవాలను అధ్యయనం చేయడానికి, కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
వివరాలు
కమిటీ నివేదికలో భయానక వాస్తవాలు
ఈ కమిటీ ఇటీవల సమర్పించిన నివేదికలో మహిళల పరిస్థితులపై పలు దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. మలయాళ సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలు, పని పరిస్థితులు, పారితోషికాల్లో అసమానతలు, అలాగే టెక్నికల్ విభాగాల్లో మహిళల భాగస్వామ్యం తగ్గుదల వంటి అంశాలపై కమిటీ సమగ్ర అధ్యయనం చేసింది. పలువురు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా, మొత్తం 235 పేజీల నివేదికను కేరళ ప్రభుత్వానికి సమర్పించింది.
వివరాలు
నివేదిక అనంతర పరిణామాలు
ఈ నివేదిక బహిర్గతమైన తర్వాత, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన అనేక నటిమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను బహిర్గతం చేశారు. వీటి ప్రభావంతో ఈ అంశం కేరళలో సంచలనం సృష్టించింది. ఫలితంగా, మలయాళ సినీ కళాకారుల సంఘం అయిన AMMA (Association of Malayalam Movie Artists)కి చెందిన మోహన్లాల్తో పాటు మరికొంతమంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే.