టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఆపాలంటూ స్టూవర్ట్ పురం ప్రజల నిరసన.. విజయవాడలో దీక్ష
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాకు అనేక అడ్డంకులు తగులుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు టీజర్ లో ఉపయోగించిన పదో ప్రయోగంపై చిత్ర నిర్మాతను ఏపీ హైకోర్టు ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఆపాలంటూ స్టూవర్టుపురం గ్రామ ప్రజలు నిరసనకు దిగారు. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఆపివేయాలని విజయవాడలో స్టూవర్టుపురం గ్రామ ప్రజలు నిరసన దీక్ష చేపట్టారు. స్టూవర్టుపురం గ్రామాన్ని నేర రాజధానిగా సినిమాలో చూపించబోతున్నారని, దానివల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని నిరసన చేపట్టారు.
తమను సంప్రదించలేదంటున్న స్టూవర్ట్ పురం ప్రజలు
మరో విషయం ఏంటంటే, టైగర్ నాగేశ్వరరావు సినిమాను తెరకెక్కిస్తున్న నిర్మాతలు కానీ, దర్శకులు కానీ సినిమా తీసే ముందు తమను సంప్రదించలేదని స్టూవర్ట్ పురం ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి ఈ నిరసనలపై చిత్ర నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో మాస్ మహారాజ రవితేజ గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నాడు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.