నాయకుడు ఓటీటీ రిలీజ్: రిలీజై రెండు వారాలు పూర్తి కాకముందే స్ట్రీమింగ్ కు సిద్ధం
తమిళంలో మామన్నాన్ పేరుతో రిలీజైన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా, ఎంత మంచి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం, 50కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. తెలుగులో నాయకుడు పేరుతో జులై 14న రిలీజైన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో విడుదలై రెండు వారాలు కూడా పూర్తి కాకముందే ఓటీటీలో దర్శనమివ్వనుంది. ఈ నెల 27నుండి తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.