Jana Nayagan: 'అలా ఎవరికీ జరగకూడదు'.. 'జన నాయగన్'పై సుధా కొంగర భావోద్వేగ వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకురాలు సుధా కొంగర ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై స్పందించారు. విజయ్కు తాను వీరాభిమానినని స్పష్టం చేసిన ఆమె.. ఈ చిత్రానికి ఎదురైన పరిస్థితి మరే సినిమాకూ ఎదురుకాకూడదని అభిప్రాయపడ్డారు. 'నేను విజయ్ను నిజంగా ఆరాధిస్తాను. అతడికి ఉన్న వీరాభిమానుల్లో నేనూ మొదటి వరుసలోనే ఉంటాను. ఆయనతో సినిమా చేయాలని గతంలో ప్లాన్ కూడా చేశాను. అయితే కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. విజయ్ నటించిన 'జన నాయగన్' మా చిత్రం 'పరాశక్తి'తో పాటు విడుదల కావాల్సి ఉంది.
Details
సెన్సార్ కారణాలతో వాయిదా
ఈ విషయాన్ని మా సినిమా ఆడియో లాంఛ్ వేదికగానూ ప్రస్తావించాను. కావాలంటే 'పరాశక్తి'ని 200 సార్లు చూస్తాను. కానీ విజయ్ 'జన నాయగన్'ను మాత్రం మొదటిరోజు, మొదటి షోనే చూసేందుకు వెళ్తానని స్టేజ్పైనే చెప్పానని సుధా కొంగర తెలిపారు. 'జన నాయగన్' విడుదల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని పేర్కొన్న ఆమె.. రిలీజ్కు కొన్ని గంటల ముందే సెన్సార్ కారణాలతో సినిమా వాయిదా పడటం బాధ కలిగించిందన్నారు. 'అలాంటి పరిస్థితి ఏ సినిమాకీ రాకూడదు. విజయ్ చిత్రంతో పోటీ పడాలని మేమెప్పుడూ అనుకోలేదు.
Details
దేశంలోనే అతిపెద్ద స్టార్ తో ఎలా పోటీ పడగలం
దేశంలోనే అతిపెద్ద స్టార్తో మేం ఎలా పోటీ పడగలం?.. అలా ఎవరూ చేయరు'' అంటూ స్పష్టత ఇచ్చారు. ఇక సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన 'పరాశక్తి' కూడా విడుదలకు ముందు ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. చివరకు జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీనిపై స్పందించిన సుధా కొంగర.. కొందరు ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ రివ్యూలు ఇచ్చారని, అదే సినిమా ఫలితంపై ప్రభావం చూపిందని ఇటీవల అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.