LOADING...
Cooking Gas: గ్యాస్ కోసం క్యూలు.. నల్లబజారులో వాణిజ్య సిలిండర్లు
గ్యాస్ కోసం క్యూలు.. నల్లబజారులో వాణిజ్య సిలిండర్లు

Cooking Gas: గ్యాస్ కోసం క్యూలు.. నల్లబజారులో వాణిజ్య సిలిండర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం దేశంలో వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాపై పడుతోంది. పలు ప్రాంతాల్లో ఎల్‌పీజీ ఏజెన్సీల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున క్యూలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా కొన్ని చోట్ల వాటిని నల్లబజారులో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడటం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో చమురు, ఎల్‌పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతోంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సరఫరా సమస్యలు తలెత్తడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గ్యాస్‌ అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై దృష్టి పెడుతున్నాయి.

వివరాలు 

వాణిజ్య సిలిండర్ల సరఫరాపై సమీక్షకు కమిటీ

ఆలయాలు, మఠాలు వంటి ధార్మిక సంస్థల కార్యకలాపాలపై కూడా ఈ కొరత ప్రభావం చూపుతోంది. అయోధ్యలోని ప్రసిద్ధ అమావా ఆలయంలో నిర్వహించే 'రామ్‌ రసోయీ' అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇదే సమయంలో మైక్రోవేవ్‌ అవెన్లు,ఇండక్షన్‌ స్టౌలు వాడకాన్ని ప్రారంభించాలని ఐఆర్‌సీటీసీ పశ్చిమ జోన్‌ కేటరింగ్‌ యూనిట్లకు ఆదేశాలు జారీ చేసింది. నల్లబజారులో గ్యాస్‌ విక్రయాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎల్‌పీజీ సిలిండర్‌ బుకింగ్‌ మధ్య వ్యవధిని 21రోజుల నుంచి 25రోజులకు పెంచినట్టు వెల్లడించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గృహ వినియోగదారులు బుక్‌ చేసిన రెండున్నర రోజుల లోపే సిలిండర్‌ అందించే విధానాన్ని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.

వివరాలు 

గ్యాస్‌ కొరతపై మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ నిలదీత

వంటగ్యాస్‌ సరఫరా సమస్యపై కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా గృహ వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దేశంలో గ్యాస్‌ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయకుండా మోదీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ఎల్‌పీజీ కొరతపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.

Advertisement