ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో షార్ట్ సర్క్యూట్ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం
రైలు ప్రమాదాలకు భారతీయ రైల్వేలు పర్యాయపదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అనేక రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రైలు ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడే దుస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఎస్4, ఎస్5 బోగీల్లోంచి దట్టమైన పొగలను గుర్తించిన సిబ్బంది హుటాహుటిన లోకో పైలట్లకు సమాచారం చేరవేశారు. దీంతో తక్షణమే రైలును పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య నిలుపుదల చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులంతా భయాందోళనలతో పరుగు లంకించుకున్నారు. దీంతో ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
మార్గం సరిగ్గా లేక రైలు వద్దకు చేరుకోలేకపోయిన అగ్నిమాపక దళాలు
అయితే రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే స్పందించాయి. అయినప్పటికీ సకాలంలో ఘటనా స్థలంలోకి చేరుకోలేకపోయాయి. వాహనాల రాకపోకలకు మార్గం సరిగ్గా లేనందు వల్ల మంటలు ఆర్పే ప్రక్రియ మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో క్రమంగా మంటలు 6 బోగీలనూ చుట్టుముట్టాయి.ఘటనలో 4 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది ఆగమేఘాల మీద బోగీల మధ్య లింక్ను తొలగించారు. అనంతరం రైలును కాస్త ముందు వరకు తరలించారు. విషయం తెలుసుకున్న దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ ఘటనా స్థలానికి పయనమయ్యారు. అప్పటికే అక్కడికి చేరిన ఆర్డీవో భూపాల్రెడ్డి, రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులతో సంప్రందింపులు జరుపుతున్నారు.
లగేజీ పూర్తిగా కాలిపోవడంతో తీవ్ర ఆందోళనలో ప్రయాణికులు
మరోవైపు ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు తమ సామగ్రి గురించి ఆందోళనకు లోనవుతున్నారు. రైలు ప్రమాదంలో లగేజీ అంతా లోపలే వదిలి బయటకు పరిగెత్తామని, అంతలోనే వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయని బోరుమంటున్నారు. ఉద్యోగ వేటలో హైదరాబాద్ వెళ్తుండగా, రైలు ప్రమాదంలో సర్టిఫికెట్లన్నీ దగ్ధమయ్యాయని ఓ యువతి తీవ్రంగా విలపించింది. ఈ నేపథ్యంలో సదరు రైలు ప్రయాణికులను గమ్యస్థానం హైదరాబాద్కు తరలించేందుకు ప్రత్యేకంగా ఆరు బస్సులను ఏర్పాటు చేశారు. మిగతా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా లోకమాన్య తిలక్ రైలును ఘటన స్థలికి పంపించారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం.