Kerala landslides: విరిగిపడిన కొండచరియలు.. 11మంది మృతి.. శిథిలాల క్రింద వందలాది మంది..!
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) బాధిత ప్రాంతంలో ఫైర్ ఫోర్స్ , NDRF బృందాలను మోహరించినట్లు తెలిపింది. అలాగే ఎన్డిఆర్ఎఫ్కు చెందిన మరో బృందం వాయనాడ్కు చేరుకుంది. సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం ధృవీకరించింది.
భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం
KSDMA ఫేస్బుక్ పోస్ట్ ప్రకారం, కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్,రెండు బృందాలు కూడా రెస్క్యూ ప్రయత్నాలలో సహాయం చేయడానికి వాయనాడ్కు వెళ్లాలని ఆదేశించారు. చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని భయాందోళన చెందుతున్నట్లు బాధిత ప్రాంతాల స్థానికులు తెలిపారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన దృష్ట్యా ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను తెరిచి, అత్యవసర ఆరోగ్య సేవల కోసం రెండు హెల్ప్లైన్ నంబర్లను జారీ చేసిందని తెలిపారు. వైత్తిరి,కల్పత్త,మెప్పాడి,మనంతవాడి ఆసుపత్రులను అప్రమత్తం చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య కార్యకర్తలందరూ రాత్రిపూట సేవ కోసం చేరుకున్నారు.వయనాడ్లో మరిన్ని ఆరోగ్య కార్యకర్తల బృందాలను మోహరిస్తారు.
భారీ వర్షం తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి
కేరళలోని వాయనాడ్లోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షాల తరువాత కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా మంది చిక్కుకుపోయారు. జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 హెల్ప్లైన్ నంబర్లను జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు ఎంఐ-17, ఒక ఏఎల్హెచ్ సూలూరు నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరాయి.
మంత్రి వాయనాడ్లో పర్యటిస్తారు: సీఎం
వాయనాడ్లో కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఘటన గురించి తెలిసినప్పటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రి వాయనాడ్లో పర్యటించి కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు.