
Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్.. ఐదుగురు రోగులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుగా ఇచ్చిన ఇంజెక్షన్ల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాదకర సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఈ ఆసుపత్రిలోని ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు నిన్న రాత్రి వేళ గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు.
మృతుల కుటుంబ సభ్యుల ప్రకారం, ఈ ఐదుగురికీ మృత్యువాత పడే కొన్ని నిమిషాల ముందే ఆసుపత్రి సిబ్బంది రెండో రౌండ్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు.
వివరాలు
పోలీసులకు బాధితులు ఫిర్యాదు
"అర్ధరాత్రి ఓ నర్సు వచ్చి మా పక్కనే ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చారు. మా సోదరికి కూడా అదే రకం సూది వేశారు. కొద్ది క్షణాల్లోనే ఆమె తీవ్ర నొప్పితో కేకలు వేస్తూ కుప్పకూలిపోయింది. డాక్టర్ వచ్చి పరిశీలించేలోపు ఆమె మృతి చెందింది" అని ఓ మృతురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
చనిపోయిన వారంతా గతంలో అక్కడే శస్త్రచికిత్స చేయించుకున్నవారే అని, ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అని మృతుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
అయితే, ఇంజెక్షన్ ఇవ్వగానే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని తెలిపారు.
ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలు
స్పందించని ఆసుపత్రి యాజమాన్యం
పోలీసులు ఆసుపత్రికి చేరుకొని అక్కడ భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేశారు.
ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మరణానికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.
అయితే, ఇప్పటి వరకు ఆసుపత్రి యాజమాన్యం దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.