Page Loader
Monsoon Rains: ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు - శిమ్లాలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం 
ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు - శిమ్లాలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

Monsoon Rains: ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు - శిమ్లాలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమయ్యాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని పది జిల్లాల్లో వాతావరణ శాఖ భారీ వర్షాల కారణంగా వరద హెచ్చరికలు జారీ చేసింది. శిమ్లాలో ఉన్న ఓ ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. అయితే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తుగా భవనం వాసులను ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. అదే ప్రాంతంలో ఉన్న ఇతర భవనాలకూ ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు.

వివరాలు 

వర్షాల ధాటికి ముగ్గురు మృతి

గత 24 గంటల వ్యవధిలో హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల ధాటికి ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 129 రహదారులు మూసివేయబడ్డాయి. మండీ, సిర్మౌర్ జిల్లాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలన్ జిల్లాలో ఓ వంతెన పూర్తిగా కూలిపోయింది. ప్రస్తుతం కంగ్రా, మండీ, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ నేపథ్యంలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది మాన్సూన్‌లో మొత్తం 550 మంది మృతి చెందిన సంగతి గుర్తుంచుకోవాలి.

వివరాలు 

చార్‌ధామ్ యాత్ర మళ్లీ ప్రారంభం 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని అధికారులు తొలగించారు. ఉత్తర్‌కాశీ జిల్లాలో గతంలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలో సిలాయ్ బైండ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కూలిపోయింది. అక్కడ గల్లంతైన ఏడుగురి కోసం రెస్క్యూ టీమ్‌లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. యమునోత్రి రహదారిపై మరమ్మత్తులు ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుప్పకూలిన 5 అంతస్తుల భవనం