
SLBC tunnel Collapse : SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈరోజు (శుక్రవారం) టన్నెల్లో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ కోసం ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టారు.
రెస్క్యూ ఆపరేషన్ ఏడో రోజుకు చేరగా, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో కార్మికుల జాడ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా స్కానింగ్ నిర్వహించగా, కొన్ని మీటర్ల లోతులో శకలాలు ఉన్నట్లు గుర్తించారు.
టీబీఎం మిషన్ కట్టింగ్, శిథిలాల తొలగింపు
దక్షిణ మధ్య రైల్వే నిపుణులు టీబీఎం మిషన్ను ప్లాస్మా గ్యాస్ కట్టర్స్ సాయంతో కట్ చేశారు.
బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టి, జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కొన్ని శకలాలను గుర్తించారు. వీటిని మృతదేహాలుగా భావిస్తూ పరిశీలన చేస్తున్నారు.
వివరాలు
గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షలు
ఈ రోజు కార్మికుల ఆచూకీ కోసం ప్రభుత్వం అత్యాధునిక 'గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్' (జీపీఆర్) పరీక్షలు నిర్వహించింది.
గురువారం, జీపీఆర్ పరికరాన్ని సొరంగం లోపలికి పంపించి, పైకప్పు కూలిన ప్రాంతంలో మట్టి, శిథిలాల కింద ఏమైనా ఉందా అనేది పరిశీలించారు.
ఈ ప్రక్రియలో కొన్ని శకలాలను గుర్తించి, దాదాపు మూడు మీటర్ల లోతులో మెత్తని భాగాలు ఉన్నట్లు తేలింది.
జీపీఆర్ టెక్నాలజీ ద్వారా సహాయక చర్యలు
టన్నెల్ ప్రమాద స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది.
భూమిలో కూరుకుపోయిన వారి స్థితిని గుర్తించేందుకు ఆధునాతన 'జీరో గ్రావిటీ పెనెట్రేటింగ్ రాడార్' (జీపీఆర్) టెక్నాలజీని ఉపయోగించి టన్నెల్ను పూర్తిగా స్కాన్ చేసింది.
వివరాలు
రెండు రోజుల్లో మరింత సమాచారం
ఈ టన్నెల్లో చిక్కుకున్న వారి ఖచ్చితమైన సమాచారం రావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.
ఎన్జీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్స్ ద్వారా కొన్ని ప్రాంతాలను గుర్తించినప్పటికీ, పూర్తిగా ఖచ్చితమైన సమాచారం అందుకోవడానికి మరిన్ని రాడార్ పిక్చర్స్ అవసరమని అన్నారు.
అంతవరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.