Haridwar: బ్లడ్ క్యాన్సర్ని నయం అవుతుందని..బాలుడిని గంగలో ముంచడంతో..
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పెను విషాదం చోటు చేసుకుంది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అయితే, 5 నిమిషాల పాటుగంగా నదిలో ముంచితే కాన్సర్ తగ్గుతుందని బాలుడి మేనత్త సుధ మూఢనమ్మకం పెట్టుకుంది. ఆ మూఢనమ్మకం ప్రకారం బాలుడిని గంగా నదిలో 5నిమిషాల పాటు ముంచింది. చివరకు బాలుడు మరణించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో నివసించే కుటుంబం నిన్న ఉదయం 9గంటల ప్రాంతంలో హరిద్వార్కు బయలుదేరింది. చిన్నారితో పాటు అతని తల్లిదండ్రులు,అత్త ఉన్నారని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు.
బాలుడిని నదిలో ముంచిన అత్త
ఆందోళన కలిగించే ఈ వీడియోలో గంగా నది ఒడ్డున ఉన్న హర్ కీ పౌరీ ఘాట్ వద్ద బాలుడి తల్లిదండ్రులు ప్రార్థనలు చేస్తున్నప్పుడు అతని అత్త సుధ బాలుడిని దాదాపుగా 5 నిమిషాల పాటు నదిలో ముంచి స్నానం చేయించింది. పక్కనే ఉన్న కొంతమంది బాలుడు నీటి అడుగున చాలా సేపు ఉండడాన్ని గమనించి, బాలుడిని బయటకు తీసుకువచ్చారు.అప్పటికే బాలుడు మరణించాడు. అత్త దూకుడుగా స్పందిస్తూ,బాలుడిని బయటకు లాగుతున్న వారిపై దాడికి కూడా ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పోలీసుల అదుపులో తల్లితండ్రులు,అత్త
మరో వీడియోలో బాలుడి అత్త మృతదేహం పక్కనే కూర్చొని బిడ్డ తిరిగి బతికి వస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పింది. హరిద్వార్ సిటీ పోలీస్ చీఫ్ స్వాతంత్ర కుమార్ మాట్లాడుతూ, బాలుడు ఢిల్లీలోని టాప్ హాస్పిటల్లో క్యాన్సర్ చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తమకు చెప్పారని చెప్పారు. వైద్యులు చేతులు ఎత్తేయడంతో, తమ బిడ్డను గంగా నది నయం చేస్తుందని కుటుంబ సభ్యులు విశ్వసించారని తెలిపారు. తల్లిదండ్రులను ,బాలుడి అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.