Page Loader
Delhi CM: దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన 
దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన

Delhi CM: దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సమృద్ధి యోజన (Mahila Samriddhi Yojana)ను త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ పథకంలో అర్హులైన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ నిధుల కోసం రూ.5100 కోట్ల కేటాయింపునకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. పథకానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దిల్లీలో పేద మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించే పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు తన నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని రేఖా గుప్తా తెలిపారు.

Details

వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్

ఈ కమిటీలో అశీష్‌ సూద్‌, పర్వేశ్‌ వర్మ, కపిల్‌ మిశ్రా వంటి సీనియర్‌ మంత్రులు ఉన్నారని చెప్పారు. ఇక, లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా వెబ్‌ పోర్టల్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రచారం చేసింది. ఆమ్‌ఆద్మీ పార్టీ రూ.2100 ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, బీజేపీ మరో రూ.400 అదనంగా ప్రకటించింది. ఈ వ్యూహాలతో ముందుకెళ్లిన బీజేపీ 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

Details

జేపీ నడ్డా ప్రకటన 

దిల్లీ మహిళా సమృద్ధి యోజన పథకానికి ఆమోదం లభించిన విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వెల్లడించారు. ఈ పథకం ద్వారా పేద మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి, సమాజంలో వారి స్థాయిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు.