హైదరాబాద్: ముషీరాబాద్లో స్క్రాప్ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ ముషీరాబాద్లోని స్క్రాప్ యార్డులో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్క్రాప్ యార్డ్లో పనిచేస్తున్న బాధితుడు గౌసుద్దీన్ ఓ బాక్స్ను కట్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఆ బాక్స్లో రసాయనం లేదా పెయింట్ నిల్వ చేసినట్లు తాము అనుమానిస్తున్నట్లు, ఈ సందర్భంగా జరిగిన ప్రతిచర్య కారణంగా అది పేలి ఉంటుందని ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపారు. గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్లూస్ టీం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షలు నిర్వహించింది. పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.