Page Loader
Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!

Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో అనధికారికంగా నివసిస్తున్న వలసదారులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజా ఆదేశాల ప్రకారం, ఆధార్, పాన్, రేషన్ కార్డులను ఇకపై భారతీయ పౌరసత్వానికి ఆధారంగా పరిగణించమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, రోహింగ్యా వలసదారులు ఈ డాక్యుమెంట్లను సృష్టించి తప్పుడు పౌరసత్వాన్ని చూపిస్తున్నారని అధికారులు తెలిపారు.

Details

శరణార్థులకు భారత ప్రభుత్వం గుర్తింపు లేకుండా రక్షణ లేదు

UNHCR జారీ చేసిన శరణార్థి కార్డులు కలిగిన వ్యక్తులు కొందరు ఉననా, సరైన ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా వారికి భారతదేశంలో చట్టబద్ధంగా నివాసం ఉండే హక్కు లేదని అధికారులు స్పష్టం చేశారు. శరణార్థి గుర్తింపు ఉన్నా, భారత ప్రభుత్వ అధికారిక అనుమతి లేకపోతే వారికి డిపోర్టేషన్ (నిర్వాసనం) నుండి రక్షణ ఉండదని చెప్పారు. ఏప్రిల్ చివరలో అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం కింద, ఢిల్లీలోని అన్ని జిల్లాల్లో నిఘా పెంచారు. ప్రతి జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌ కు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు.

Details

చెల్లుబాటు అయ్యే పౌరసత్వ పత్రాలు ఇవే

ఈ కఠినమైన ధృవీకరణ ప్రక్రియలో భారత ఓటర్ ID కార్డు లేదా పాస్‌పోర్ట్ మాత్రమే భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లుగా పరిగణించారు. ఆధార్, పాన్, రేషన్ కార్డులు ఇకనుంచి పౌరసత్వానికి నిబంధనల ప్రకారం చెల్లవు. న్యాయ మార్గమే పరిష్కారం తమకు చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నాయని భావించే వ్యక్తులు, వాటిని తిరస్కరించినపుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని అధికారులు తెలిపారు.

Details

పాకిస్థానీయులపై ప్రత్యేక నిఘా

ఇటీవలి జమ్ముకశ్మీర్ ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ఘటన తరువాత పాకిస్థాన్ పౌరులకు ఇచ్చిన వీసాలన్నింటినీ, మెడికల్, డిప్లొమాటిక్, దీర్ఘకాలిక వీసాల మినహాయింపుతో, రద్దు చేసింది. ఏప్రిల్ 29 తర్వాత ఇచ్చిన మెడికల్ వీసాలనూ నిలిపివేసింది. దీనివల్ల ఢిల్లీలో ఉన్న సుమారు 3,500 పాకిస్తాన్ పౌరులలో 520 మంది ముస్లిం వలసదారులు ఉన్నట్లు గుర్తించగా, వారిలో 400 మంది ఇప్పటికే అటారి సరిహద్దు మార్గంగా పాకిస్థాన్ తిరిగి వెళ్లిపోయారని ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

Details

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పోలీసు, ఇంటెలిజెన్స్ సంస్థలు కలసి అక్రమ వలసదారులను గుర్తించి దేశ బహిష్కరణ చర్యలు చేపడుతున్నాయి. వచ్చే వారాల్లో ఈ మిషన్ మరింత వేగవంతం కానుందని సమాచారం.