
Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన 'పీ4 కార్యక్రమం' (పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ఫర్ పాడవలపూడి మోడల్) అమలు దశలోకి ప్రవేశిస్తోంది.
ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం సూచనల మేరకు, నూజివీడు సీడ్స్ సీఎండీ మండవ ప్రభాకరరావు ఆ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.
ఈ పనిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ఆయన, గ్రామాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు.
ప్రాథమిక సహాయంగా, ఆగిరిపల్లికి చెందిన నన్నబోయిన వెంకట్రావుకు గేదె కొనుగోలు కోసం రూ.75,000, బోనం లక్ష్మికి ఫ్యాన్సీ షాపు ఏర్పాటు కోసం రూ.50,000 కేటాయించారు.
Details
గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత
ఈ మొత్తాలను మండవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నూజివీడు మండలం తుక్కులూరులో జరిగిన కార్యక్రమంలో, నూజివీడు సీడ్స్ వ్యవస్థాపక ఛైర్మన్ మండవ వెంకట్రామయ్య, రమాదేవి దంపతుల చేతుల మీదుగా చెక్కుల రూపంలో అందించారు.
అంతేకాదు లక్ష్మి పిల్లలను హీల్ పాఠశాలలో చేర్పించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రాధాన్యత క్రమంలో చేపడతామని మండవ ప్రభాకరరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్కలెక్టర్ స్మరణ్ రాజ్, పీ4 కోఆర్డినేటర్ విశ్రాంత డీజీఎం సుబ్బారావు, ఇతర అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
పీ4 కార్యక్రమం రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.