Andhra Pradesh: మెట్రోలకు మాత్రమే కాదు.. గ్రామాల్లోనూ కంటైనర్ గృహాల ట్రెండ్
ఈ వార్తాకథనం ఏంటి
మెట్రో నగరాలు,పెద్ద పట్టణాలకే పరిమితమై ఉన్న కంటైనర్ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండటం,అవసరమైతే మరో ప్రాంతానికి సులభంగా మార్చుకునే వీలుండటం వంటి ప్రయోజనాల కారణంగా ప్రజలు వీటిని ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏలూరుకు చెందిన సాయిరాం,లక్ష్మీప్రసన్న దంపతులకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలుచేస్తున్నవీరు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానంలోనే తమ పనులు నిర్వహిస్తున్నారు. తమ ప్రాంతంలోని తాపీమేస్త్రీ కాలనీలో వీరికి కొంత భూమి ఉంది. మొదట అక్కడ శాశ్వత ఇల్లు నిర్మించుకోవాలని ఆలోచించారు. అయితే భవిష్యత్తులో ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావొచ్చని భావించి కంటైనర్ ఇంటిని ఎంచుకోవాలని నిర్ణయించారు.
వివరాలు
నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చు
దీనికోసం విజయవాడలోని ఒక సంస్థను సంప్రదించి, తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్తో ఇంటిని తయారుచేయించారు. ఇద్దరు సౌకర్యంగా నివసించేందుకు అనువుగా హాలు ఏర్పాటు చేయగా, పై అంతస్తులో పడకగది, మరుగుదొడ్లు నిర్మించారు. అదనంగా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ వేసి, వంటగది కూడా ఏర్పాటు చేశారు. ఇంటి ముందు భాగంలో పాలికార్బొనేట్ షీట్లతో పైకప్పు అమర్చారు. గాలి,సహజ కాంతి సమృద్ధిగా వచ్చేలా కిటికీలు అమర్చారు. మొత్తం ఈ నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు.